భర్త బతికుండగానే చనిపోయాడని రెండో పెళ్ళి, షాకిచ్చిన నవ వరుడు
తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెండో పెళ్ళి
బెంగుళూరు: భర్త బతికుండగానే ఆమె మరణించినట్టుగా తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించిన ఓ వివాహిత రెండో పెళ్ళి చేసుకొంది. అంతేకాదు రెండో భర్త కట్టిన తాళితో సహ బంగారు ఆభరణాలను విక్రయించింది. అయితే భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె గురించి విచారిస్తే భర్త ఉండగానే తనను వివాహం చేసుకొన్న విషయాన్ని గుర్తించాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.
భర్త బతికుండగానే చనిపోయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి మరో పెళ్ళి చేసుకొన్న వెంకటలక్ష్మి అనే వివాహితపై బెంగుళూరులోని కుమారస్వామి లే అవుట్ పోలీస్స్టేషన్ లో కేసు నమోదైంది.
కర్ణాటకలోని చిక్బళ్ళాపురం ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మీ తన భర్త మరణించినట్టుగా స్థానిక తహసీల్దార్ నుండి ధృవీకరణ పత్రాన్ని సంపాదించింది. అయితే ఆమె భర్త అప్పటికి బతికే ఉన్నాడు. అయితే అదే ప్రాంతంలో బ్యాంకులో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తితో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది. నాగరాజుకు అప్పటికే భార్య చనిపోయింది. మరో మహిళను పెళ్ళి చేసుకోవాలని నాగరాజు ప్లాన్ చేస్తున్నాడు.
ఈ తరుణంలో నాగరాజుతో వివాహానికి వెంకటలక్ష్మి ఒప్పుకొంది. తన భర్త కూడ మృతి చెందాడని వెంకటలక్ష్మి నాగరాజును నమ్మించింది. అంతేకాదు 1990లోనే తన భర్త మరణించినట్టుగా స్థానిక తహసీల్దార్ నుండి తప్పుడు ధృవీకరణ పత్రం తీసుకొచ్చంది. ఈ ధృవీకరణ పత్రం ఆధారంగా నాగరాజుతో వెంకటలక్ష్మి వివాహం జరిగింది.
వివాహమైన కొంతకాలానికే వెంకటలక్ష్మి నాగరాజు కట్టిన మంగళసూత్రంతో సహ ఇతర బంగారు ఆభరణాలను విక్రయించింది. ఈ విషయమై అనుమానం వచ్చిన నాగరాజు వెంకటలక్ష్మి గురించి ఆరా తీశాడు. వెంకటలక్ష్మి భర్త బతికే ఉన్నాడని తేలింది. తాను మోసపోయినట్టుగా గుర్తించిన నాగరాజు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.