ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. రెండు గంటల పాటు చర్చ, నిర్ణయాలపై ఉత్కంఠ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అవి ఏంటి అన్నది మాత్రం అత్యంత గోప్యంగా వుంచారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రి మండలి దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అవి ఏంటి అన్నది మాత్రం అత్యంత గోప్యంగా వుంచారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు వుంటాయని ఇప్పటికే ప్రధాని మోడీ చెప్పడంతో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరును మార్చే బిల్లు కూడా తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. మరి కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
అంతకుముందు పార్లమెంట్లో మోడీ మాట్లాడుతూ.. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు.
Also Read: పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం.. చరిత్రను గుర్తుచేసుకున్న మోదీ.. కీలక పాయింట్స్ ఇవే..
ఈ సందర్భంగా చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని అన్నారు. 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు వేదికగా నిలిచిందని చెప్పారు. ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పార్లమెంట్లో విభేదాలు, వివాదాలను మనందరం చూశామని.. అయితే అదే సమయంలో కుటుంబ భావనను కూడా చూశామని చెప్పారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.