కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను
ఐదు లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎలాంటి పన్నులు చెల్లింపులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి ఏటా రూ. 5 నుండి ఏడున్నర లక్షల వార్షికాదాయం ఉన్న వారు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది
ప్రతి ఏటా ఏడున్నర నుండి రూ. 10 లక్షల వార్షికాదాయం ఉన్న వారు 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పది లక్షల నుండి పన్నెండున్నర లక్షల వార్షికాదాయం ఉన్న వారు ప్రతి ఏటా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పన్నెండున్నర లక్షల నుండి పదిహేనున్నర లక్షల వార్షికాదాయం ఉన్న వారు 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా పదిహేనున్నర లక్షల వార్షికాదాయం ఉన్న వారంతా 30 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ దఫా పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రతి ఏటా ఐదు నుండి ఏడున్నర లక్షల వార్షికాదాయం ఉంటే గతంలో 20 శాతం ఉండేది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పన్నును 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు.
ఏడున్నర లక్షల నుండి పది లక్షల లోపు వార్షికాదాయం ఉంటే గతంలో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుండి కేవలం 15 శాతం పన్నును చెల్లించాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5 శాతం పన్నును తగ్గించారు.
ఇక పది నుండి పన్నెండున్నర లక్షలకు వార్షికాదాయం ఉంటే గతంలో 30 శాతంలోపుగా పన్నును చెల్లించేవారు. ఈ ఆర్ధిక సంవత్సరం నుండి 20 శాతం మాత్రమే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా పన్నెండున్నర లక్షల నుండి 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 25 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. కొత్త స్లాబ్స్ ల్లో 80 సీ రిబేట్లు వర్తించవని కేంద్రం ప్రకటించింది.