Gujarat hooch tragedy : గుజరాత్లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మరణం..
గుజరాత్ లో కల్తీ మద్యం సేవించి 19 మంది చనిపోయారు. మరో 40 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లోని బొటాడ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి ఇప్పటి 19 మంది మరణించారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స కోసం వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. ఇందులో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్వాలా, రోజిద్ గ్రామాలకు చెందిన మద్యం స్మగ్లర్లు నీటిలో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోసారి విచారణకు హాజరైన సోనియా గాంధీ.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఈ కల్తీ మద్యానికి సంబంధించిన నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు అనధికారికంగా గుజరాత్ ఏటీఎస్ను రంగంలోకి దింపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పింటూ అనే బూట్లెగర్తో పాటు ఇతరులను అరెస్టు చేసినట్లు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణను త్వరలో గుజరాత్ అధికారికంగా ఏటీఎస్కు అప్పగించే అవకాశం ఉంది. విచారణ కోసం ఫోరెన్సిక్, హెల్త్ అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేశారు.
ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని , నీటిలో రసాయనాలు కలిపి కల్తీ మద్యంగా విక్రయిస్తున్నట్లు బొటాడ్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. బాధితుల మృతదేహాలు స్థానిక ఆసుపత్రి రావడం ప్రారంభించినప్పుడు ఈ ఘటన గురించి తమకు తెలిసిందని వాఘేలా చెప్పారు.
బాధితులు తాగిన విషపూరిత మద్యంలో ఉండే మిథైల్ను ఎమోస్ అనే కంపెనీ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. గోడౌన్ మేనేజర్ జయేష్ అకా రాజు తన బంధువు సంజయ్కు రూ.60 వేలకు 200 లీటర్ల మిథైల్ను సరఫరా చేశాడు. అది తాగిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. కాగా మొత్తం 600 లీటర్ల మిథైల్ను ఎమోస్ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక అందిన తర్వాత పోలీసులు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. నిందితులపై హత్యానేరం మోపనున్నట్లు వారు తెలిపారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. నిషేధం అమలులో ఉన్న గుజరాత్లో పెద్ద మొత్తంలో అక్రమ మద్యం అమ్ముడవుతోందని ఆరోపించారు. కల్తీ మద్యం విక్రయించే వ్యక్తులు రాజకీయ రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆయన, మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ముపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘ నిషేధం ఉన్నప్పటికీ గుజరాత్లో అక్రమ మద్యం విపరీతంగా విక్రయించబడటం దురదృష్టకరం. అక్రమ మద్యం విక్రయించే వ్యక్తులు ఎవరు? వారు రాజకీయ రక్షణను అనుభవిస్తున్నారు. (అక్రమ మద్యం అమ్మకం ద్వారా వచ్చిన) డబ్బు ఎక్కడికి పోతుంది ? దీనిపై విచారణ జరగాలి.’’ పోర్బందర్లో విలేకరులతో అన్నారు.