బాల్ థాక్రేవి కాదు.. మీ సొంత తండ్రుల ఫొటోలతో ఓట్లు అడగండి.. రెబల్ నేతలు, బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
Maharashtra: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టులతో పాటు ప్రజాక్షేత్రంలో జరిగే యుద్ధంలో శివసేననే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
Former Maharashtra CM Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్ర రాజకీయాలు.. శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో దీనికి తెరపడింది. అయితే, శివసేన రెబల్ నేతలు, ఉద్ధవ్ థాక్రే మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్ రాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడేక్కిస్తోంది. శివసేన అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. పార్టీ మౌత్పీస్ 'సామ్నా'కు ఇచ్చిన తన ఇంటర్వ్యూలో.. తాను ద్రోహానికి గురయ్యాననీ అన్నారు. తాను కదలనేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ తిరుగుబాటు కుట్రను ప్రారంభించారని పేర్కొంటూ.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులపై ఘాటు విమర్శలు గుప్పించారు.
"నేను ఆసుపత్రిలో కదలలేని స్థితిలో ఉన్నప్పుడు తిరుగుబాటు ప్రణాళిక చేశారు. నా శరీరం కదలనప్పుడు, వారి కదలికలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి" అని ఉద్ధవ్ సామ్నాతో అన్నారు. శివసేన వర్సెస్ రెబల్ నాయకుల పోరుకు దారితీసిన జూన్లో మూడింట రెండు వంతుల మంది శివసేన ఎమ్మెల్యేలు రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే గ్రూప్ లో చేరడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలోనే రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో కలిసి ప్రభత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర పడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వారిని ఉద్దేశించి ఉద్ధవ్ థాక్రే స్పందిస్తూ.. "నేను ఆయనను ముఖ్యమంత్రిని చేసినా, అతని ఆశయాలు పైశాచికమైనవి. వారిని విశ్వసించడమే నా పెద్ద తప్పు. నా తండ్రి బాల్ థాక్రే పేరు మీద ఓట్లు అడగకుండా... వారి తల్లిదండ్రుల పేర్లతో ఓట్లు అడగాలంటూ " ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ‘చెట్టు నుంచి కుళ్లిన ఆకులు రాలిపోవాలి.. చెట్టు నుంచి అన్నీ తెచ్చుకున్నవాళ్లు చెట్టునే వదిలేస్తున్నారు’ అంటూ షిండే వర్గంపై విరుచుకుపడ్డారు.
"వదిలి వెళ్ళిన వారు భాగానే సంపాదించుకున్నారు.. కాని మేము ఇప్పుడు సాధారణ వ్యక్తుల నుండి అసాధారణ నాయకులను తయారు చేస్తాము ... వారు తమ తల్లిని (అసలు శివసేన) మింగాలనుకుంటున్నారు" అని రెబల్ నాయకులపై విమర్శలు గుప్పించారు. షిండే వర్గంతో పొత్తు పెట్టుకున్న బీజేపీపై కూడా విమర్శల దాడిని కొనసాగించారు. 2019లో తన డిమాండ్లను అంగీకరించి ఉంటే కాషాయ పార్టీకి చాలా గౌరవం వచ్చేదని అన్నారు. “బీజేపీ ఇప్పుడు ఏమి చేసిందో, వారు అప్పుడు (2019) చేసి ఉంటే, అప్పుడు అది చాలా గౌరవప్రదంగా జరిగేది. వారి అదనపు ఖర్చు కోట్లలో ఆదా అయ్యేది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఢిల్లీ మహారాష్ట్రకు వెన్నుపోటు పొడిచింది.. తమను ఆదుకున్న వాళ్లను అంతం చేయబోతున్నారు’ అంటూ కేంద్ర బీజేపీ సర్కారును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వారు కొంతమంది హిందువుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. "హిందుత్వలో మరో భాగస్వామి అక్కర్లేదు కాబట్టి వారు శివసేనను అంతం చేయాలనుకుంటున్నారు. థాక్రేలను శివసేన నుండి వేరు చేయాలనుకుంటున్నారు. వారి హిందుత్వం అవసరం లేదు కానీ.. హిందుత్వ రాజకీయాలు కావాలి" అంటూ బీజేపీపై ఘాటు విమర్శలు గుప్పించారు.