పులుల గణనను విడుదల చేసిన ప్రధాని.. దేశంలో గణనీయంగా పెరిగిన సంఖ్య.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలుసా ?
దేశంలో పులుల సంఖ్య పెరిగింది. 2018లో భారత్ లో 2967 పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 3167 పెరిగింది. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పులుల గణాంకాలను విడుదల చేశారు.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశంలో తాజా పులుల గణన వివరాలను వెల్లడించారు. దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రకటించారు. 2022 నాటికి భారతదేశంలో 3167 పులులు ఉన్నాయని తెలిపారు. 2018తో పోలిస్తే 200 పులులు పెరిగాయని చెప్పారు. 2018లో భారత్ లో 2967 ఉన్నాయని తెలిపారు.
ప్రధాని విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో గత రెండు దశాబ్దాల్లో పులుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. 2006 లో భారతదేశంలో 1411 పులులు ఉన్నాయి. 2010 నాటికి ఈ సంఖ్య 1706 కు పెరిగింది. 2018 నాటికి ఆ సంఖ్య 2967 చేరుకుంది. తాజాగా వాటి సంఖ్య 3167 కు పెరిగిందని వెల్లడైంది.
ఐబీసీఏను ప్రారంభించిన ప్రధాని
ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఏ)ను ప్రధాని ప్రారంభించి స్మారక నాణేన్ని విడుదల చేశారు. ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలను పురస్కరించుకుని ప్రారంభ సెషన్ లో ప్రధాని మోడీ మరియు ఇతర ప్రముఖులు టైగర్ కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన 'అమృత్ కాల్ కా విజన్ ఫర్ టైగర్ కన్జర్వేషన్' అనే ప్రచురణను విడుదల చేశారు, అలాగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (5వ చక్రం) సారాంశ నివేదికను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పులుల సంరక్షణలో ప్రాజెక్ట్ టైగర్ ముందంజలో ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘ ప్రకృతిని పరిరక్షించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగం. ప్రాజెక్ట్ టైగర్ విజయం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో, ప్రపంచంలోని పులుల జనాభాలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయి.’’ అని అన్నారు.
ప్రపంచ భూభాగంలో కేవలం 2.4 శాతం మాత్రమే ఉన్న భారత్ ప్రపంచ వైవిధ్యంలో 8 శాతం వాటాను కలిగి ఉందని ప్రధాని అన్నారు. ‘‘ భారత్ లో దశాబ్దాల క్రితమే చిరుతలు అంతరించిపోయాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఈ అద్భుతమైన పులిని తీసుకొచ్చాం. అలాగే మన దేశం దాదాపు 30,000 ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగుల శ్రేణిగా ఉంది.’’ అని అన్నారు.
దయచేసి బందీపూర్ టైగర్ రిజర్వ్ ను అదానీకి అమ్మొద్దు - ప్రధాని మోడీకి కర్ణాటక కాంగ్రెస్ విజ్ఞప్తి
అంతకుముందు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ ఫ్రంట్ లైన్ ఫీల్డ్ స్టాఫ్, సంరక్షణ చర్యల్లో నిమగ్నమైన స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పర్స్'లో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను కూడా కలిశారు. ‘‘ ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ ప్రకృతికి, జీవులకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. మన గిరిజన సమాజం జీవితం, సంప్రదాయం నుండి ఏదైనా తీసుకోవాలని నేను మిమ్మల్ని (విదేశీ ప్రముఖులను) కోరుతున్నాను.’’ అని ఆయన ట్వీట్ చేశారు.