నీలుగాయిని ఢీకొట్టిన హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ప్రయాణిస్తున్న వాహనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో హుడాకు పెద్దగా గాయాలు కాలేదు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ప్రయాణిస్తున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హుడాతో పాటు వాహనంలో ఉన్న ఇతర ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ సీఎం ఆ హిసార్ లోని గిరాయే గ్రామంలో బాక్సర్ సవీతి బూరాను సన్మానించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం ఒక్క సారిగా నీలుగాయిని (మనుబోతు)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుడాకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ మూగజీవిని ఢీకొట్టిన అనంతరం ఎస్ యూవీలో ఉన్న రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు తెరుచుకోవం వల్ల ఆయన తీవ్ర గాయాల నుంచి తప్పించుకున్నాడు.
అయితే ఆయన వాహనం భారీగా దెబ్బతింది. కొంత సమయం తరువాత భూపిందర్ సింగ్ హుడా వేరే వాహనంలో బయలుదేరి యథావిధిగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘‘హుడా బాగానే ఉన్నారు. షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనం ధ్వంసమైనప్పటికీ అందులో ఉన్నవారందరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. హర్యానా మాజీ సీఎం ప్రస్తుతం తన సన్నిహితుడి వివాహ వేడుకకు హాజరవుతున్నారు’’ అని హుడా మీడియా సలహాదారు సునీల్ పార్టి ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కు తెలిపారు.