ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ ను చంపేస్తా- బాలీవుడ్ కండల వీరుడికి మళ్లీ హత్యా బెదిరింపులు..ఈ సారి ‘రాఖీ భాయ్’ నుంచి
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మళ్లీ హత్యా బెదిరింపులు వచ్చాయి. రాజ్ స్థాన్ లోని జోద్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి కాల్ చేసి సల్మాన్ ఖాన్ ను ఏప్రిల్ 30వ తేదీన హత్య చేస్తానని హెచ్చరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మరో సారి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ 30వ తేదీన ఆయనను చంపేస్తానని ఓ వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు సోమవారం ఫోన్ వచ్చింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ‘రాకీ భాయ్’ అతడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే బెంగాల్ లో రామనవమి హింసాకాండ - కలకత్తా హైకోర్టు
మార్చిలో ఇ-మెయిల్ ద్వారా హత్యా బెదిరింపు
గత నెలలో కూడా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఖాన్ సన్నిహితుడు, మెనేజర్ కు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ అనే ముగ్గురిపై బాంద్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ మెయిల్ లో తీహార్ జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా ప్రస్తావించారు. బాంద్రా పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ బెదిరింపు మెయిల్ పంపించిన వ్యక్తి పేరు మోహిత్ గార్గ్ గా గుర్తించారు. అందులో ‘‘గోల్డీ మీ బాస్ సల్మాన్ తో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు ఇంటర్వ్యూ చూసి ఉండొచ్చు. లేకపోతే చూడమని సలహా ఇవ్వండి. మీరు దానికి ముగింపు పలకాలనుకుంటే, గోల్డీతో ముఖాముఖిగా మాట్లాడమని అతడికి చెప్పండి. ముందుగానే చెప్పండి లేదంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’’ అందులో పేర్కొన్నారు.
పాక్ లో కంటే భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది - నిర్మలా సీతారామన్
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లే బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో గతేడాది జూన్ లో ఓ బెదిరింపు లేఖ దొరికింది. అందులో గత ఏడాది మే 29న గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన గాయకుడు సిద్ధు మూస్ వాలాకు పట్టిన గతే సల్మాన్ కు పడుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు.
సల్మాన్ ఖాన్ కు ఎందుకు ఇన్ని హత్యా బెదిరింపులు ?
1998 కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ కు హత్యా బెదిరింపులు వస్తున్నాయి. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని కంకణిలో రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు 57 ఏళ్ల నటుడిపై ఆరోపణలు ఉన్నాయి. 2018లో ఐదేళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. అయితే బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకను పూజిస్తుంది. వాటిని పవిత్ర జంతువులుగా భావిస్తుంది. కాగా.. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ముఠాల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ ఎస్ యూవీని కొనుగోలు చేశారు.