National News: దేశంలో రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో మొత్తం రూ.14,115 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమెదం లభించింది.
ఢిల్లీలో 8.1 కిలోమీటర్ల ఆరు లేన్ల టన్నెల్
కేంద్ర కేబినెట్ రూ.6,969.67 కోట్ల వ్యయంతో 8.1 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల టన్నెల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ టన్నెల్ ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని శివమూర్తి ఇంటర్చేంజ్ను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్తో అనుసంధానం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే గురుగ్రామ్, ద్వారకా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ ఢిల్లీ నుంచి దక్షిణ ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అలాగే భవిష్యత్తులో నిర్మించనున్న ఎయిమ్స్-మహిపాల్పూర్ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బరాపుల్లా ఎలివేటెడ్ రోడ్డుకు అనుసంధానం కల్పించనున్నారు. దీంతో తూర్పు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్ ప్రాంతాలకు కూడా మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.
పర్యావరణానికి నష్టం లేకుండా టన్నెల్ నిర్మాణం
ఈ టన్నెల్ సదర్న్ రిడ్జ్ అడవి ప్రాంతం కిందుగా వెళ్తుంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మెషీన్ల (TBM) సహాయంతో నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టులో 3.14 కిలోమీటర్ల భూగర్భ టన్నెల్, ఎలివేటెడ్ రోడ్లు, అప్రోచ్ ర్యాంపులు, సాధారణ రహదారులు నిర్మించనున్నారు. అదనంగా 1.8 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్డు, మహిపాల్పూర్ వైపు కొత్త ఫ్లైఓవర్, మహిపాల్పూర్-ఛత్తర్పూర్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ యూ-టర్న్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణం ద్వారా సుమారు 7.54 లక్షల ప్రత్యక్ష ఉద్యోగ దినాలు, 9.8 లక్షల పరోక్ష ఉద్యోగ దినాలు సృష్టి అవుతాయని అంచనా.
ఉత్తరప్రదేశ్లో కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్ఫీల్డ్ హైవే
మరో కీలక నిర్ణయంగా రూ.7,145.14 కోట్ల వ్యయంతో 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నాలుగు లేన్ల రహదారిని భవిష్యత్తులో ఆరు లేన్లుగా విస్తరించేలా నిర్మిస్తారు. ఇది భోపాల్-కాన్పూర్ ఆర్థిక కారిడార్లో కీలక భాగంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అమలు చేయనుంది. ఈ హైవేపై గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాన్పూర్ నుంచి కబ్రాయ్ చేరుకోవడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుండగా, కొత్త హైవే పూర్తయితే కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు.
వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధికి భారీ ఊతం
ఈ హైవే వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా ఖనిజ సంపద అధికంగా ఉన్న కబ్రాయ్ మైనింగ్ ప్రాంతం నుంచి ఖనిజాలు, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణా సులభమవుతుంది. ఈ మార్గం ఎన్హెచ్-34, ఎన్హెచ్-35, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే, కాన్పూర్ రింగ్ రోడ్ సహా పలు ప్రధాన రహదారులతో అనుసంధానం అవుతుంది. అలాగే 16 ఆర్థిక కేంద్రాలు, 9 సామాజిక కేంద్రాలు, 10 లాజిస్టిక్స్ హబ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సుమారు 1.2 కోట్ల ఉద్యోగ దినాలు సృష్టి అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2028-29 నాటికి ఈ మార్గంలో రోజుకు సగటున 18 వేలకుపైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


