జేఈఈ మెయిన్స్ చీటింగ్ కేసులో రష్యా హ్యాకర్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
జేఈఈ మెయిన్స్లో చీటింగ్ జరిగిందని కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ కేసులో రష్యాకు చెందిన ఓ హ్యాకర్ ప్రమేయం కూడా ఉన్నదని, 820 మంది చీట్ చేయడానికి ఈ హ్యాకర్ సహకరించాడని ఆరోపించింది. జేఈఈ మెయిన్స్ సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా సుమారు 9 వేల మంది విద్యార్థులు రాశారు.
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం రాసే జేఈఈ మెయిన్స్ పరీక్షలో చీటింగ్ చాలా సీరియస్ విషయం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. తాజాగా, ఈ కేసులో ఏకంగా ఓ రష్యన్ హ్యాకర్ చేయి ఉన్నట్టు తెలిసింది. 820 మంది విద్యార్థులు ఈ పరీక్షలో చీటింగ్ చేయడానికి రష్యన్ హ్యాకర్ మిఖైల్ షార్జిన్ సహకరించినట్టు సీబీఐ ఆరోపించింది. ఈ విషయమై విచారించడానికి ఆ హ్యాకర్ను రెండు రోజుల కస్టడీకి అనుమతించాలని ఢిల్లీ కోర్టును కోరింది. అందుకు ఢిల్లీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.
గత నెల సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇది నిర్దేశిత పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రిస్ట్రిక్టెడ్ కంప్యూటర్లలో మాత్రం ఈ పరీక్ష నిర్వహిస్తారు. కానీ, మిఖైల్ షార్జిన్ ఈ సిస్టమ్నూ హ్యాక్ చేసినట్టు తెలుస్తున్నది. తద్వార విద్యార్థులు తమ సహచరులతో రిమోట్ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం లభించినట్టు భావిస్తున్నారు. తద్వార వేరే చోట కూర్చున్న మరొకరు వీరి కొశ్చన్ పేపర్ను సాల్వ్ చేసి ఆన్సర్లు అప్డేట్ చేసి ఉండొచ్చని చెబుతున్నారు.
సరళంగా చెప్పాలంటే.. విద్యార్థుల కంప్యూటర్లను టీచర్లు లేదా కోచ్లు తమ నియంత్రణలోకి తీసుకుని సాల్వ్ చేయడం అన్నమాట.
ఇప్పటి వరకు ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు.
మిఖైల్ షార్జిన్ కజక్స్తాన్ నుంచి నిన్న మన దేశంలో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. 25 ఏళ్ల మిఖైల్ షార్జిన్ ప్రొఫెషనల్ హ్యాకర్ అని, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డెవలప్ చేసిన ఐలియోన్ సాఫ్ట్వేర్ను ఆయన హ్యాక్ చేశారని వివరించింది.
సీబీఐ ఒక వేళ తన ఎలక్ట్రానిక్ డివైజ్లను యాక్సెస్ చేయాలనుకుంటే.. అది తన ముందే చేయాలని మిఖైల్ షార్జిన్ కోర్టులో కండీషన్ పెట్టాడు. కాగా, యూజర్నేమ్స్, పాస్వర్డ్లను తమకు చెప్పాలని ఆదేశించాలని కోర్టును సీబీఐ కోరింది.
హర్యానాలో సోనిపాట్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో ఈ రిమోట్ యాక్సెస్ జరిగినట్టు విచారణలో తేలుతున్నది. తొలుత 20 మంది విద్యార్థులు మాత్రమే చీట్ చేసినట్టు అనుకున్నారు. వారిని వచ్చే మూడేళ్ల వరకు పరీక్ష రాయకుండా బ్యాన్ చేసింది.
సీబీఐ కేసు రిజిస్టర్ చేసి పలు నగరాల్లో రైడ్లు చేసి ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను సీజ్ చేసింది. వీటి ద్వారానే మిఖైల్ షార్జిన్ వరకు విచారణ చేరింది. ఈ స్కామ్లో చాలా మంది విదేశీయులూ ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.