Russia: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలో ర‌ష్యాపై ప్ర‌పంచంలోని చాలా దేశాలు అంక్ష‌లు మ‌రింత‌గా పెంచుతున్నాయి.  అయితే, పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల వల్ల భారత్‌కు అందించే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడదని రష్యా పేర్కొంది. 

Russia: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని మ‌రింత‌గా పెంచింది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల‌ను వ‌రుస‌గా స్వాధీనం చేసుకుంటోంది. ఈ దాడి కార‌ణంగా ఇప్ప‌టికే రెండు దేశాల‌కు చెందిన వేల మంది ప్రాణాలు కోల్పోయార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలో ర‌ష్యాపై ప్ర‌పంచంలోని చాలా దేశాలు అంక్ష‌లు మ‌రింత‌గా పెంచుతున్నాయి. అయితే, భార‌త కు ర‌ష్యా అందిస్తాన‌న్న ఆయుధాల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల వల్ల భారత్‌కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడదని రష్యా పేర్కొంది. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మీడియా సమావేశంలో జాతీయ కరెన్సీలలో వ్యాపారం చేయడానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని కూడా ప్రస్తావించారు. ఎస్-400 డీల్‌కు సంబంధించి ఎలాంటి ప్రభావం పడదని, ఇది 100 శాతం హామీకి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు.

అయితే, మొత్తం వాణిజ్యం, ఆర్థిక సహకారానికి సంబంధించినంతవరకు, విధించబడుతున్న కఠినమైన ఆంక్షలు అంతిమంగా ఎలా ప్రభావం చూపుతాయో చూద్దాం అని అలిపోవ్ అన్నారు. పాశ్చాత్య ఆంక్షలు మరియు ఉక్రెయిన్‌లోని సంఘర్షణ భారతదేశానికి కీలకమైన రక్షణ పరికరాల సరఫరాపై ప్రభావం చూపుతుందా అని అడిగినప్పుడు, ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి యంత్రాంగాలను ఏర్పాటు చేసినట్లు రష్యా ప్రతినిధి చెప్పారు. "రష్యా ఎప్పుడూ కింద నుంచే పైకి లేచింది" అని చెప్పాడు. అది మళ్లీ పెరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మా భద్రతకు చర్యలు తీసుకున్నాం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది అని తెలిపారు. 

ఇదిలావుండగా, యూరోపియన్ యూనియ్ రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అనేక ఆంక్ష‌లు సైతం విధించింది. అలాగే, ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన దాడులకు వ్యతిరేకంగా బ్రిటన్ అన్ని దేశాలు క‌లిపి రావాల‌ని పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడవచ్చని ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ నగరాలపై పుతిన్ దాడులను విశ్వవ్యాప్తంగా ఖండించాలని బ్రిటన్ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేసిన తర్వాత రష్యాపై అమెరికా కఠినంగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌లో పుతిన్ గేమ్ ప్లాన్‌ను అరికట్టడానికి అమెరికా, యూరోపియ‌న్ దేశాలు, వాటి మిత్రదేశాలు తీసుకున్న వరుస చర్యలు భారత్ ను కూడా ప్ర‌భావితం చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఎస్-400 మిస్సైల్ సిస్ట‌మ్ భార‌త్ కు అత్యంత కీల‌కం ! 

S-400.. S-200,S-300 క్షిపణి వ్యవస్థకు అప్‌గ్రేడ్ వెర్ష‌న్‌. ఎస్-400 మిస్సైల్ సిస్ట‌మ్ ప్ర‌పంచంలోని అత్యంత అధునాత‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. S-400 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బాంబర్లు, క్రూయిజ్ మరియు బాలిస్టిక్ క్షిపణులు మరియు మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు) సహా బహుళ వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటు పాకిస్థాన్‌, అటు చైనా స‌రిహ‌ద్దుల్లోనిత్యం ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకోవ‌డం.. భార‌త్ కు వ్య‌తిరేకంగా ఈ రెండు దేశాలు క‌లిసి ముందుకు సాగుతుండ‌టం భార‌త్ త‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుపర్చుకోవ‌డం కీల‌క విష‌యం. ఈ క్ర‌మంలోనే ఈ రెండు దేశాల దాడుల‌ను త‌ట్టుకోవ‌డానికి ఎస్‌-400 మిస్సైల్ సిస్ట‌మ్ భార‌త్ కు చాలా అవ‌స‌రం.