పండ్ల కంటైనర్లో రూ. 502 కోట్ల విలువైన హై క్వాలిటీ కొకైన్ సీజ్.. ముంబయి పోర్టులో లభ్యం
ముంబయి పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశారు. రూ. 502 కోట్ల విలువైన హై క్వాలిటీ కొకైన్ను పండ్ల కంటైనర్లో కనుగొన్నారు.
ముంబయి: మహారాష్ట్రలో ముంబయి పోర్టులో భారీ కొకైన్ను అధికారులు సీజ్ చేశారు. 50 కిలోల హై క్వాలిటీ కొకైన్ను పండ్ల కంటైనర్లో కనుగొన్నారు. ఈ కొకైన్ విలువ సుమారు రూ. 502 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవీ ముంబయి పొరుగునే ఉన్న నవా షెవా పోర్టులో పండ్ల కంటైనర్లో 50 కిలోల కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సీజ్ చేసినట్టు ఓ అధికారి శనివారం వెల్లడించారు.
ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కొకైన్ సీజ్ చేయడం ఇదే మొదటి సారి. ఈ డ్రగ్స్ను గురువారం సీజ్ చేసినట్టు తెలిపారు. 50.23 కిలోల కొకైన్ను 50 బ్రిక్స్లుగా తయారు చేశారని, దీని విలువ సుమారు రూ. 502 కోట్లుగా ఉంటుందని అధికారిక స్టేట్మెంట్ పేర్కొంది. పియర్స్, గ్రీన్ యాపిల్స్ల కంటైనర్లో ఈ డ్రగ్స్ సీజ్ చేశారు. ఇది దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి అయింది. అక్టోబర్ 6న నవా షెవా పోర్టులో ఈ డ్రగ్స్ను పట్టుకున్నారు. దిగుమతి చేసుకున్న వారిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేశారు.
దక్షిణాఫ్రికా నుంచి నవా షెవా పోర్టుకు వస్తున్న కన్సైన్మెంట్ గురించి డీఆర్ఐ ముంబై జోనల్ యూనిట్కు ముందుగానే నిఘా వర్గాల సమాచారం అందినట్టు ఆ అధికారిక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ కంటైనర్ను గుర్తించి డీఆర్ఐ అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు. అందులో సుమారు ఒక్కో కిల బరువుగల ఒక్కో బ్రిక్ గ్రీన్ యాపిల్ బాక్స్లలో కనిపించినట్టు వివరించారు. ఈ బ్రిక్స్ హై క్వాలిటీ కొకైన్తో తయారు చేసినవని పేర్కొన్నారు.