‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న పంజాబ్ ప్రతిపక్షాలు.. ఆమోదించిన సీఎం
అగ్నిపథ్ స్కీమ్ ను పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన సూచనను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ స్వీకరించింది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ డిమాండ్ చేసింది.
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పంజాబ్ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనికి సీఎం సమ్మతం తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ సమయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ‘అగ్నిపథ్’ అంశాన్ని లేవనెత్తారు. ఈ పథకం పంజాబ్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
మహారాష్ట్ర.. తర్వాతి టార్గెట్ జార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రస్తుతం సైన్యంలో పంజాబ్ నుంచి 7.8 శాతం యువత ప్రాతినిధ్యం వహిస్తోందని అయితే ఈ పథకం వల్ల భవిషత్తులో అది 2.3 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం పంజాబ్ ప్రయోజనాలకు విరుద్ధం అని మిస్టర్ బజ్వా వాదించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో సీఎం ఉమ్మడి తీర్మానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. దీనిని ఒక భావోద్వేగ సమస్యగా అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకుడు బజ్వా సూచనను ఆమోదించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని అన్నారు. ‘‘ నేను ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను బజ్వాతో ఏకీభవిస్తున్నాను. ఆయన సూచనలను పరిగణలోకి తీసుకుంటాం’’ అని అన్నారు. ‘‘ ఒక 17 ఏళ్ల యువకులు రక్షణ దళాలలో చేరితారు. అందులో ఎక్కువ మంది యువకులు నాలుగేళ్ల సర్వీస్ తరువాత ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు వారు మాజీ అవుతారు. అయితే అలా మాజీ అయిన వారికి తరువాత ఎలాంటి ప్రయోజనాలు కూడా ఉండవు ’’ అని భగవంత్ మాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీ ఆఫీసులో భద్రతా సిబ్బందిని నియామించాల్సి వస్తే అగ్నివీర్లుగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తానని బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గీయ అన్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఇది సిగ్గుచేటని విమర్శించారు. అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నా.. బీజేపీ ఇలాంటి చట్టాలను ఎందుకు తీసుకువస్తుందో అర్థం చేసుకోవడంలో తాను విఫలమవుతున్నానని చెప్పారు. ‘‘ వారు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. CAA, తరువాత ఇప్పుడు అగ్నిపథ్. వారు ఈ చట్టాలను తీసుకొచ్చిన ప్రతి సారీ.. తాము ప్రజల ప్రయోజనాల కోసమే చట్టాలు తీసుకొచ్చామని, కానీ ప్రజలకు అర్థం కావడం లేదని చెబుతూనే ఉన్నారు. అంటే వారు మాత్రమే తెలివైనవారా ? అలాంటప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేని చట్టాలు తయారు చేయకూడదు’’ అని ఆయన చెప్పారు.
Agnipath: అగ్నిపథ్ స్కీమ్.. నాలుగు రోజుల్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ కు 94,000 దరఖాస్తులు
అయితే పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ అగ్నిపథ్ పథకాన్ని సమర్థించారు. ఈ అంశంపై సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత బజ్వా సూచనపై ఎదురు చేశాడు. ఈ పథకం అమలైతే 2029లో కూడా తాము అధికారంలోకి రాలేమని వారికి తెలుసు అని కాంగ్రెస్ ను విమర్శించారు. కాగా పది రోజుల కిందట కొందరు యువకులు జలంధర్లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. తరువాత సీఎం భగవంత్ మాన్ తో ఫోన్లో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన చేపట్టాలని సీఎం వారికి సూచించారు. నిరసనకారుల డిమాండ్లకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు.