Agnipath scheme: అగ్నిపథ్ పథకంపై వివాదాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు నాలుగు రోజుల్లో 94,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం వరకు భారత వైమానిక దళానికి అగ్నిపథ్ పథకం కింద 56,960 దరఖాస్తులు వచ్చాయి.
Agnipath -Indian Air Force: భారత ఆర్మీలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకువచ్చింది. అయితే, దీనిపై యువత నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలను హింసాత్మకంగానూ మారాయి. ప్రతిపక్షాలు సైతం అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిని వెనక్కి తీసుకునేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. త్రివిధ దళాధిపతులు సైతం దీనిపై వెనక్కి తగ్గకుండా నియామక ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి 94,281 దరఖాస్తులు వచ్చాయి.
జూన్ 14న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన తర్వాత, దీనికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు దాదాపు ఒక వారం పాటు అనేక రాష్ట్రాలను కదిలించాయి. అనేక ప్రతిపక్ష పార్టీలు దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. "మొత్తం 94,281 అగ్నివీర్ వాయు ఆశావహులు ఉదయం 10:30 (సోమవారం) వరకు నమోదు చేసుకున్నారు. జూలై 5 న రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది" అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎ భరత్ భూషణ్ బాబు ట్విట్టర్లో తెలిపారు. ఆదివారం వరకు అగ్నిపథ్ పథకం కింద IAFకి 56,960 దరఖాస్తులు వచ్చాయి.
అగ్నిపథ్ పథకం కింద 17 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల పదవీకాలానికి చేర్చుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వారిలో 25 శాతం మంది రెగ్యులర్ సర్వీస్కు తీసుకుంటారు. ప్రభుత్వం జూన్ 16న ఈ పథకం కింద రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 2022 సంవత్సరానికి 21 నుండి 23 సంవత్సరాలకు పెంచింది. పదవి విరమణ తర్వాత కేంద్ర పారామిలటరీ దళాలు మరియు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల్లోని అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఉపశమన చర్యలను ప్రకటించింది. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్నివీరుల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అగ్నిపథ్ పథకం కింద చేర్చబడిన సైనికులకు రాష్ట్ర పోలీసు బలగాలలోకి ప్రవేశానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటించాయి. ఇక అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, ఆందోళనలకు దిగినవారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు స్పష్టం చేశాయి.