Asianet News TeluguAsianet News Telugu

బిహార్‌లో నకిలీ టీకా జాబితా.. మోడీ, అమిత్ షా, సోనియా, ప్రియాంక చోప్రాల పేర్లతో కలకలం

బిహార్‌లో టీకా తీసుకున్న వారి జాబితాలో నకిలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రాల పేర్లు టీకా తీసుకున్నట్టుగా జాబితాలో రావడం కలకలం రేపింది. వీరి పేర్లు తరుచూ రిపీట్ కావడం కూడా జరిగింది. ఈ పేర్లు వ్యాక్సినేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇటీవలే డేటా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

priyanka chopra name in bihars arwal district vaccination fradu list
Author
Patna, First Published Dec 6, 2021, 8:39 PM IST

పాట్నా: నరేంద్ర మోడీ(Narendra Modi), అమిత్ షా(Amit Shah), సోనియా గాంధీ(Sonia Gandhi), ప్రియాంక చోప్రా(Priyanka Chopra)... ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గనే వారి జాబితా అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది Biharలో అర్వాల్ జిల్లాలోని కార్పి కమ్యూనిటీ సెంటర్‌లో Vaccines తీసుకున్నట్టు ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ అయిన పేర్ల జబితా. ఔను.. ఈ Data Fraud ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆ కమ్యూనిటీ సెంటర్‌లో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను అధికారులు ప్రస్తుతం సస్పెండ్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం టీకా పంపిణీలో ఫ్రాడ్‌లు వెలుగులోకి రావడం విస్మయాన్ని కలిగిస్తున్నది.

ఇటీవలే కార్పి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీ చేసిన జాబితాను అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు రక్షించడానికి ఎంతో నిబద్ధతతో జరుగుతున్న టీకా పంపిణీలో ఫ్రాడ్ వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారింది. సెలెబ్రిటీల పేర్లు, రాజకీయ ప్రముఖుల పేర్లు ఈ కమ్యూనిటీ సెంటర్‌లో టీకా వేసుకున్నట్టుగా తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేయడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. వారి పేర్లే చాలా సార్లు రిపీట్ అయింది కూడా. తనిఖీల తర్వాత అధికారులు బాధ్యులపై చర్యలకు దిగారు. ముందుగా ఆ కమ్యూనిటీ సెంటర్‌లోని ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్‌లను సస్పెండ్ చేశారు.

Also Read: ఇప్పటివరకు వ్యాక్సిన్ ఒక్కడోసూ తీసుకోనివారికే ప్రమాదం.. సీసీఎంబీ డైరెక్టర్...

జిల్లా మెజిస్ట్రేట్ జే ప్రియదర్శిని ఈ ఫ్రాడ్‌పై స్పందిస్తూ ఈ ఫ్రాడ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని, టెస్టులు, వ్యాక్సినేషన్ కోసం తాము ఎంతో కష్టపడి పని చేస్తున్నామని తెలిపారు. అలాంటి సమయంలో ఇలా అవకతవకలు చోటుచేసుకుంటుండటం బాధాకరమని అన్నారు. కేవలం కార్పి కమ్యూనిటీ సెంటర్‌లోనే కాదు.. ఇతర అన్ని హెల్త్‌కేర్ సెంటర్‌ల డేటాను తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే ఈ ఉదంతంపై మాట్లాడారు. కొవిడ్ టీకా తీసుకున్న వారి జాబితాలో అవకతవకలు ఆరోగ్య శాఖ ముందుకు రాగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు డేటా ఎంట్రీలను ఉద్యోగంలో నుంచి తొలగించామని వివరించారు. అంతేకాదు, ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించిన డేటాను కూడా చెక్ చేయాలని జిల్లా మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ అధికారులతో మాట్లాడి నిర్దేశించానని తెలిపారు. ప్రతి హాస్పిటల్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించానని చెప్పారు. ఏమైనా తప్పులు జరిగితే బాధ్యతులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Omicron: ముంబయిలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో మొత్తం సంఖ్య 10

ఇదే సందర్భంలో మరో డేటా ఫ్రాడ్‌నూ విలేకరులు మంత్రి ముందుకు తెచ్చారు. పాట్నాలో ఇద్దరు వ్యక్తులు తమ రెండో డోసు తీసుకోవడానికి వెళ్లగా.. ఆ పేర్ల మీద ఇప్పటికే రెండో డోసులు తీసుకున్నారన్న సమాధానం విని వారు ఖంగుతిన్నారు. ఈ విషయం డేటా ఫ్రాడ్‌పై అనేక అనుమానాలు తెచ్చింది. దీనిపై స్పందిస్తూ అవి టెక్నికల్ అంశాలని అన్నారు. వ్యవస్థలో తప్పులు జరగకుండా సాధ్యమైనంత మేరకు తాము కృషి చేస్తామని చెప్పారు. కానీ, ఎవరు తప్పు చేసినా.. వారు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios