ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో భేటీ అయ్యారు. వీరి భేటి ఆసక్తికరంగా మారింది.
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రమూలపై దాడులకు దిగారు. ఆపరేషన్ సిందూర్ పేరిట ఏకంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై నేలమట్టం చేసింది భారత ఆర్మీ... ఇందులో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారట. అయితే భారత్ ప్రతిదాడికి పాక్ సిద్దమయ్యింది... మిస్సైల్స్ తో భారత ఆర్మీ పై దాడికి యత్నించింది. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను తిప్పికొట్టింది.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దవాతావరణం వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ 15 భారత సైనిక స్థావరాలపై భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడికి యత్నించిన కొన్ని గంటల తర్వాత ఈ ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో ప్రధాని మోదీ భేటీకావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి భేటీలో భారత్ ఇంకా ఏం ప్లాన్ చేస్తుందోనని ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదని... ఇంకా కొనసాగుతోందని ప్రకటించారు. భారత్ పై దాడికి ప్రయత్నిస్తున్న పాక్ కు గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ తో ప్రధాని భేటీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. భారత్, పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు... పాక్ కు ధీటుగా ఎదుర్కొనేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వీటి పరిణామాలు ఎలా ఉండనున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది.