పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

ఢిల్లీ:

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పాకిస్తాన్ నుంచి భారత్ సరిహద్దులో ఉద్భవిస్తున్న తీవ్ర ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా ఘటనల నేపథ్యంగా దేశ రక్షణ పరిస్థితిని అంచనా వేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మోదీ సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్జై శంకర్ హాజరయ్యారు. తాజా పరిస్థితులను సైనిక అధికారుల నుంచి మోదీ సమీక్షించారు. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అత్యవసరంగా ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.

ఆదివారం ఉదయం జమ్మూ ప్రాంతంలో జనావాసాలపై పాక్ వైపు నుంచి షెల్లింగ్ జరిగింది. గడిచిన కొన్ని రోజులుగా సరిహద్దు రేఖపై ఎదురుదాడులు కొనసాగుతుండగా, తాజాగా ఇది జనావాస ప్రాంతాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ షెల్లింగ్ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. ఈ షెల్లింగ్ సమయంలో ప్రజలు తక్షణమే రక్షణ కోసం శరణు పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సైనికులు గమనిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మీడియాతో మాట్లాడాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ ప్రెస్ మీట్ను వాయిదా వేశారు.ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేంద్రం సమగ్రంగా పరిస్థితిని పరిశీలిస్తూ, అవసరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్యలు ప్రారంభించింది.