ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడిపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఇమేజ్‌కి ముప్పు వాటిల్లేలా నాయకుల వ్యాఖ్యలు బయటకు రావడంతో, ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నేతలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ, తన అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించి, పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కఠినంగా హెచ్చరించారు.

ఇటీవలి రోజుల్లో బీజేపీకి చెందిన కొంతమంది నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి విజయ్ షా ‘ఆపరేషన్ సింధూర్’పై చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా అభిప్రాయాలు, అలాగే ఎంపీ రామ్ చందర్ జాంగ్డా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వీటిపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్…

పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన  సైనికుల భార్యల రించి ఎంపీ జాంగ్డా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆ మహిళలు తిరిగి దాడి చేసి ఉంటే మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని, వీరవనితల మాదిరిగా ప్రవర్తించలేకపోయారన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర ప్రతికూలతకు దారితీసింది. ఆయన ఇలా ప్రశ్నించినప్పుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ వంటి మహిళలు కూడా యుద్ధంలో పాల్గొన్నారని సమాధానమిచ్చారు.

ఇటు కల్నల్ సోఫియా అనే ఆఫీసర్‌పై చేసిన వ్యాఖ్యలతో సైన్యం ప్రతిష్ట దెబ్బతింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన మోడీ, నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఇది ఎన్నికల ముందర పార్టీకి కలిగే ప్రతికూలతను నియంత్రించేందుకు మోడీ చేపట్టిన చర్యగా కనిపిస్తోంది. బీజేపీ ‘ఆపరేషన్ సింధూర్’ను విజయం గానే ప్రజలకు చూపించాలని చూస్తున్న వేళ, కొంతమంది నేతల మాటల వల్లనే అదే విషయం పార్టీకి భారంగా మారే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, ప్రధాని మోడీ పార్టీ నేతలకు కట్టుదిట్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలపై ఇకపై మౌనం పాటించాలని, ప్రతి అంశానికి స్పందిస్తూ వ్యతిరేకతలు తీసుకుని వచ్చే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టంగా చెప్పారు.