ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, పాక్ ఆర్మీని అల్లకల్లోలం చేసింది. ఆ సమయంలో పాక్ కమాండర్లు వారి పోస్టులను వదిలి పారిపోయినట్లు సమాచారం.

ఉగ్రవాదులను, ఉగ్రవాదంతో రెచ్చిపోతున్న పాకిస్తాన్‌ కి భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో చుక్కలు చూపించింది. అర్థరాత్రి సమయంలో పాక్‌ మీద భారత్‌ దళాలు విరుచుకుపడి సుమారు 100 మందికి పైగా ఉగ్రమూకలను మట్టుబెట్టింది.అంతేకాకుండా పాకిస్తాన్ సైనిక పోస్టులను కూడా ఏరిపారేసింది. ఈ ఊహించని దాడులతో పాక్‌ ఆర్మీ దిక్కుతోచని స్థితిలో పడింది.

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ సైన్యంలోని కమాండ్‌ స్థాయి అధికారులు కూడా బతికుంటే చాలురా బాబు..బలుసాకైనా తినొచ్చు అనుకుంటు పరుగులు పెట్టినట్లు సమాచారం.ఈ మేరకు భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ముజఫరాబాద్‌ దగ్గరలో ఉన్న 75వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ కమాండర్‌ ఆ పోస్ట్‌ను వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది.

ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి…

ఆ కమాండర్‌ గురించి ఓ జూనియర్‌ అధికారి మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి పేర్కొన్నాయి. ‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా కమాండర్‌ సాబ్‌ ఇక్కడి నుంచి పారిపోయాడు. ఓ మసీదులో తలదాచుకుని ప్రార్థనలు చేసుకుంటు ఉన్నాడు. పోస్టులో కార్యకలాపాలను పునరుద్ధరించాలా? అని అడిగితే.. ‘ఆఫీసును తర్వాత తాపీగా తెరుచుకోవచ్చు. ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి’ అని వణికిపోతూ చెప్పాడు. పరిస్థితులు సద్దుమణిగే వరకు పోస్టుకు తిరిగి రానని ఆ కమాండర్‌ చెప్పాడు’’ అని సదరు జూనియర్ అధికారి ఆ చాట్‌లో అన్నాడు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. లష్కరే, జైషే మహ్మద్‌కు చెందిన కీలక శిబిరాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు టాప్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతిగా పాక్‌.. భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.