Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల హతమయ్యారు. వీరిలో మావోయిస్టుల అగ్రనేత బసవరాజు హతమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను అభినందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PM Modi Amit Shah praise forces: ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు.

ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఈ అసాధారణ విజయాన్ని సాధించిన మన భద్రతా బలగాలపై గర్వంగా ఉంది. మావోయిజాన్ని నిర్మూలించి ప్రజలకు శాంతియుతమైన, అభివృద్ధితో కూడిన జీవితం అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము” అని పేర్కొన్నారు.

 

Scroll to load tweet…

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విజయాన్ని “నక్సలిజంపై చారిత్రాత్మక విజయం”గా అభివర్ణించారు. ఆయన ట్వీట్‌లో.. “సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజును మన బలగాలు తొలిసారిగా ఎదురుదాడిలో అంతమొందించాయి. మావోయిస్టు ఉద్యమానికి ఈయన వెన్నెముక లాంటి నాయకుడు. ఈ ఘనవిజయం సాధించిన భద్రతా బలగాలకు, ఏజెన్సీలకు అభినందనలు” అని అన్నారు.

అమిత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో మొత్తం 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అలాగే, 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు. “2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.

 

Scroll to load tweet…

 

ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” అనే పేరు పెట్టారు. ఇది ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలులో (KGH) కొనసాగిన ఉమ్మడి ఆపరేషన్. మావోయిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇది కీలక దాడిగా పేర్కొంటున్నారు.

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో మాట్లాడుతూ.. “మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బస్తర్‌ను మావోయిస్టు రహితంగా మార్చే కార్యక్రమం కొనసాగుతోంది. భద్రతా బలగాలు మిషన్‌ మోడ్‌లో పనిచేస్తున్నాయి. 2026 మార్చికల్లా బస్తర్‌ను నక్సల్స్‌ రహితంగా మారుస్తామన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం” అన్నారు.

 

Scroll to load tweet…

 

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జీయన్నపేట గ్రామ నివాసి. వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. 1970ల నాటి నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నాడు. ఇతని కోసం గతంలో పోలీసులు రూ.1.5 కోట్ల రివార్డును కూడా ప్రకటించారు.