Nambala Keshava Rao: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎవరీ కేశవరావు?
Who is Nambala Keshav Rao: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మాద్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో టాప్ మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా "నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు జరిగిన చారిత్రక విజయంగా" పేర్కొన్నారు.
ఈ ఎన్కౌంటర్ బుధవారం (మే 21)న నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల త్రిసంధికి సమీపంలో అబుజ్మాద్ అడవుల్లో జరిగింది. ఇక్కడ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుల మౌలిక సమాచారంపై రెండు రోజుల క్రితం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) ఆధ్వర్యంలో ఆపరేషన్ ప్రారంభమైంది.
ఈ ఘర్షణలో మృతి చెందిన నంబాల కేశవరావు (బసవరాజు) సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో గణపతి (ముప్పాల లక్ష్మణరావు) రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆ పదవిని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు వరంగల్ లోని రెజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ప్రస్తుతం NIT) నుంచి బీటెక్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే పీపుల్స్ వార్ గ్రూప్ ఆలోచనలకు ఆకర్షితులయ్యారు.
కేశవరావు పలు మావోయిస్టు దాడులకు నేతృత్వం వహించారు. ముఖ్యంగా 2010లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ వద్ద 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి చేసిన దాడి వెనుక ఆయన ఉన్నారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యల వెనుక కూడా బసవరాజు వ్యూహం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలిపిరి లో చంద్రబాబుపై దాడిలో ఇతని హస్తం ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈ ఎన్కౌంటర్లో ఒక డీఆర్జీ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందించబడినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన అబుజ్మాద్ ప్రాంతంలో పెద్దగా జన సంచారం ఉండదు. ఇది గోవా రాష్ట్రం కంటే పెద్దదైన స్థలం. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ, కండగావ్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలికి కూడా విస్తరించి ఉంది.
హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. "నక్సలిజాన్ని నిర్మూలించేందుకు జరిగిన పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయంగా నిలుస్తుంది" అన్నారు. ఆయన 27 మంది మావోయిస్టుల మృతిని దేశ భద్రతా బలగాల దౌత్యవిజయంగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 200 మందికి పైగా మృతిచెందగా, వారిలో 183 మంది బస్తర్ డివిజన్లోనే మరణించారు.
అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి వెనుక నంబాల కేశవరావు
అలిపిరి బాంబు దాడి... ఆ పేరును వినగానే 2003 అక్టోబర్ 1న చంద్రబాబుపై జరిగిన ఘోర ఘటన గుర్తుకొస్తుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు బాంబు దాడి చేయడం దేశంలో సంచలనం రేపింది. ఈ దాడి వెనుకు నంబాల కేశవరావు కూడా ఉన్నారని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు.
2003లో అక్టోబర్ 1న తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద చంద్రబాబు కాన్వాయ్పై నక్సలైట్లు భారీ బాంబులతో దాడికి పాల్పడ్డారు. పీపుల్స్ వార్ గ్రూప్కు చెందిన మావోయిస్టులు 17 క్లేమోర్ మైన్స్ ను రహదారిలో అమర్చగా, వాటిలో 9 పేలాయి. ఈ దాడిలో చంద్రబాబుకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న బులెట్ప్రూఫ్ కారు కూడా దెబ్బతిన్నది. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గాయపడ్డారు.
చంద్రబాబు తిరుమల శ్రీవారికి సంప్రదాయ వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్నారు. అలిపిరి టోల్ గేట్ దాటిన తర్వాత కొండ దిగువ భాగంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. చంద్రబాబు తీసుకున్న కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు నక్సలైట్లకు నచ్చకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.