రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు.
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నేడు (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చకు పెట్టాలనుకుంటున్న అంశాలపై చర్చించడమే ఈ సమావేశం ఎజెండాగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నందున ఈ వర్షాకాల సమావేశాలకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 6న జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగుస్తుండగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది.
Presidential election: మమతా బెనర్జీ 'ఆదివాసి వ్యతిరేకి' అంటూ బీజేపీ పోస్టర్లు
వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) నివేదికల ప్రకారం.. సాయుధ బలగాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ఈ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాలని ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఈ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులోనే అనేక చట్టాలను ఆమోదించుకోవాలని చూస్తోంది. పెండింగ్ బిల్లులను ఇప్పుడు పాస్ చేయించుకోవాలని భావిస్తోంది.
ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఇండియన్ అంటార్కిటికా బిల్లు- 2022 ఉంది. ఇది లోక్సభలో పెండింగ్లో ఉంది. అలాగే అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు-2019 ను లోక్సభ ఆమోదించినా ఇంకా రాజ్యసభ ఆమోదం తెలపలేదు. ఈ సమావేశాల్లో దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సామూహిక విధ్వంస ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు- 2022 లోక్సభలో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఇంకా పెండింగ్ లో ఉంది. అలాగే వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు-2021 లోక్సభలో పెండింగ్లో ఉంది. సముద్రపు పైరసీ నిరోధక బిల్లు- 2019, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు- 2021 కూడా లోక్సభలో పెండింగ్లో ఉన్నాయి.
రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్స్ (రెండో సవరణ) బిల్లు- 2022 (యూపీలో జిల్లా పేరు మార్పునకు సంబంధించి మంత్రివర్గం ఆమోదించిన బిల్లు) మార్చి 2022లో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ఇంకా అది పెండింగ్ లో ఉంది. అయితే ఈ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో కొత్తగా ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లులలో సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు-2022 కూడా ఉన్నాయి. అలాగే మరో కొత్త కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు- 2022 కూడా ముద్రణ కోసం గురువారం పంపించారు. అలాగే రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు- 2019, మధ్యవర్తిత్వ బిల్లు- 2021, సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు- 2019, ప్రవాస భారతీయుల వివాహ నమోదు బిల్లు- 2019, పురుగుమందుల నిర్వహణ బిల్లు- 2020లను ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది.
