ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ శాంతి ప్రసంగాలు చేస్తోంది. ఇది సైనిక అవమానాన్ని దాచుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దాడుల తర్వాత, పాకిస్తాన్ సైన్యం తమ ప్రజలు "విజయాన్ని కాదు, శాంతిని" జరుపుకుంటున్నారని ప్రకటించింది. ఈ ప్రకటన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన తర్వాత, భారతదేశం పాకిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఈ ప్రకటన చేసింది.

చైనా ప్రభుత్వ ఛానెల్ CGTVతో జరిపిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి, "మేము కూడా అభివృద్ధి,  స్థిరత్వం వైపు కదలాలనుకుంటున్నాము. మేము పాకిస్తాన్ ప్రజలకు, మా భవిష్యత్ తరాలకు రుణపడి ఉన్నాము. అందుకే మా ప్రాధాన్యత ఎల్లప్పుడూ శాంతి" అని చెప్పుకొచ్చారు.  

అయితే పాకిస్థాన్ ఇలా ఉన్నట్లుండి శాంతి మంత్రం జపించడం భారతదేశ సైనిక ప్రతిస్పందన నుంచి తప్పించుకునే ప్రయత్నంగా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మే 10న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించిన తర్వాత భారతదేశం 11 హై-విలువ సైనిక స్థాపనలపై దాడి చేసిన విషయం తెలిసిందే. 

"పాకిస్తానీయులు విజయాన్ని కాదు, శాంతిని జరుపుకుంటున్నారు. మా ప్రజల్లో వినయం ఉంది. మేము అల్లాకు కృతజ్ఞులమై ఉన్నాము." అయితే, దాడుల సమయంలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన తర్వాత ఉద్రిక్తతను తగ్గించాలని వేడుకున్నది పాకిస్తాన్ అనే వాస్తవాన్నిమాత్రం ఆయన చెప్పలేదు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన దేశాలు వాతావరణ మార్పు, తప్పుడు సమాచారం, అధిక జనాభా వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పుకొచ్చారు.  కానీ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. 

పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ విస్తృతమైన నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ISPR దాదాపు 20,000 నకిలీ ఖాతాలను నిర్వహిస్తుందని, ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశీయ, అంతర్జాతీయ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కల్పిత కథనాలను ప్రచారం చేసింది.