కోల్‌క‌తాలో గుర్తు తెలియ‌ని డ్రోన్ల కదలికలు క‌ల‌కలం రేపింది. అస‌లు ఆ డ్రోన్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రు పంపించార‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగింది.

కోల్‌క‌తాలో ఏడు డ్రోన్లు దర్శనమిచ్చాయి. సోమవారం అర్థరాత్రి దాదాపు 45 నిమిషాల పాటు నగరం మధ్యలో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. భవానీపూర్, మైదాన్, రవీంద్ర సదన్ ప్రాంతాలపై డ్రోన్ల కదలికలను గుర్తించారు. సోమవారం రాత్రి 9:45 నుంచి 10:30 వరకు ఈ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి.

మహేష్తలా వైపు నుంచి ఈ డ్రోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. హేస్టింగ్స్, ఫోర్ట్ విలియం, బ్రిగేడ్, విక్టోరియా మెమోరియల్ ప్రాంతాలపై తిరిగాయి. మొదట కోల్‌క‌తా పోలీసులు వీటిని గుర్తించారు. వెంటనే లాల్ బజార్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. పోలీసులు డ్రోన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు డ్రోన్లు తూర్పు కోల్‌క‌తా వైపు, మరో రెండు ఉత్తర కోల్‌క‌తా వైపు వెళ్లినట్టు గుర్తించారు. సైన్యం, వైమానిక దళం, పోలీసులు డ్రోన్ల రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ ఈ డ్రోన్లకు ఎలాంటి అనుమతి లేదని తెలుస్తోంది.

పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ 'ఆపరేషన్ సింధూర్' తర్వాత పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే కశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ దాడికి పాకిస్తాన్ యత్నించగా.. భారత సైన్యం ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఇప్పుడు కోల్‌క‌తాలో ఏడు డ్రోన్లు కలకలం రేపడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం అర్ధరాత్రి మహేష్తలా, బెహాలా వైపు నుంచి ఏడు డ్రోన్లు వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. మొదట హేస్టింగ్స్ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. ఈ ప్రాంతంలో రెండో హుగ్లీ వంతెన, ఫోర్ట్ విలియం వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగు డ్రోన్లు మైదాన్ మీదుగా విక్టోరియా మెమోరియల్ వైపు వెళ్లాయి. అక్కడి నుంచి జవహర్ లాల్ నెహ్రూ రోడ్డుపై ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం చుట్టూ తిరిగాయి.

ఐదు డ్రోన్లు తూర్పు వైపు, అంటే పార్క్ సర్కస్ వైపు వెళ్లాయి. మిగిలిన రెండు ఉత్తర కోల్‌క‌తా  వైపు వెళ్లాయి. హేస్టింగ్స్ పోలీసులు ఈ డ్రోన్లను చూసి లాల్ బజార్‌కి సమాచారం ఇచ్చారు. మైదాన్, ఇతర పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఎవరైనా డ్రోన్ల సాయంతో రహస్యంగా ఫోటోలు తీస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్లు ఎక్కడికి వెళ్లాయో తెలుసుకునేందుకు పోలీసుల ఎస్‌టిఎఫ్, నిఘా విభాగం దర్యాప్తు చేస్తున్నాయి. ఈ డ్రోన్ల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.

మరోవైపు, గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ATS) ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు మైనర్. భారతీయ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసి, దేశ వ్యతిరేక సందేశాలు పోస్ట్ చేసినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

"అరెస్టయిన వారిలో ఒకరు మైనర్, మరొకరు జాసిమ్ షానవాజ్ అన్సారీ (గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నాడియాడ్‌కు చెందినవారు). వీరిద్దరూ ఓ టెలిగ్రామ్ ఛానెల్ నడుపుతున్నారు. అందులో తమ హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు షేర్ చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో, భారతీయ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్ల గురించి ATS అనేక హెచ్చరికలు అందుకుంది" అని అధికారులు తెలిపారు.