నైట్ క్లబ్లో అర్ధరాత్రి పోలీసుల రైడ్.. అదుపులోకి సుమారు 300 మంది.. ఏం జరిగిందంటే?
గురుగ్రామ్లోని నైట్ క్లబ్లో అర్దరాత్రి పోలీసులు రైడ్ చేశారు. సుమారు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీలో అక్కడ డ్రగ్స్ సాషెలు లభించాయి. దీంతో వారి బ్లడ్ శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. క్లబ్ యజమానులు, మేనేజనర్లు, ఇతర సిబ్బందిపై కేసు నమోదైంది.

న్యూఢిల్లీ: గురుగ్రామ్లోని ఓ నైట్ క్లబ్లో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో రైడ్ చేశారు. మొత్తం 288 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ముగ్గురు క్లబ్ ఓనర్లు, ముగ్గురు మేనేజర్లు, మరికొందరు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉద్యోగ్ విహార్ ఫేజ్ 3 ఏరియాలోని నైట్ క్లబ్లో శనివారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉద్యోగ్ విహార్ ఫేజ్ 3లోని కాసా డాంజా క్లబ్లో జాయింట్ పోలీసు టీమ్ రైడ్ చేసింది. తనిఖీలు చేస్తుండగా 288 మంది వద్ద నుంచి ఎలాంటి నిషేధిత డ్రగ్స్ లభించలేదు. కానీ, వారు బహుశా డ్రగ్స్ తీసుకుని ఉండే అవకాశం ఉన్నదని అనుమానిస్తున్నారు. ఎందుకంటే అక్కడే అదే నైట్ క్లబ్లో 14 డ్రగ్స్ సాషెలను పోలీసులు సీజ్ చేశారు.
288 మందిని సెర్చ్ చేస్తుండగా వారి నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని ఉద్యోగ్ ఏసీపీ మనోజ్ కుమార్ చెప్పారు. క్లబ్ వెకేట్ చేిసన తర్వాత క్రీమ్ సీన్లో టీమ్ ఇంటెన్సివ్ సెర్చ్ చేపట్టారని వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న వారి బ్లడ్ శాంపిల్స్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపిస్తామని చెప్పారు. ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఏఎస్ఐ సతీష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్లబ్ ఓనర్లు అభిషేక్ రానా, అరవింద్ యాదవ్, కునార్క్ సిక్కాలు, మేనేజర్లు మాన్ సింగ్, వీర్, దేవేష్, ఇతర స్టాఫ్ మెంబర్స్ పై ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్లు 21, 22, 25, 27, 29ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.