భారత ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆడబిడ్డల నుదిట సిందూరాన్ని చేరిపేసిన వారిని మట్టిలో కలిపేసామని…ఇకపై కూడా భారత్ తీరు ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. 

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు మారోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులనే కాదు వారిని వెనకుండి నడిపిస్తున్న పాకిస్థాన్ కు కూడా గట్టిగానే సమాధానం చెప్పామని... ఇకపై కూడా ఇలాంటి సమాధానమే ఉంటుందన్నారు. భారత సాయుధ దళాల శక్తిముందు పాకిస్థాన్ నిలవలేకపోయింది... పెద్దపెద్ద మాటలాడే వారిని చివరకు మోకాళ్లపై కూర్చోబెట్టామని ప్రధాని మోదీ అన్నారు.

ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడినుండే దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇలా 18 రాష్ట్రాల్లో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు చెందిన పలు రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బికనీర్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి స్పందించారు.

పహల్గాంలో ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదిటిపై సిందూరం చెరిపేసారని.. అందుకు ప్రతీకారంగా వారిని మట్టిలో కలిపేసామని మోదీ అన్నారు. పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తే... భారత బలగాలు కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ పూర్తిచేసి ఉగ్రవాదులను మట్టుబెట్టారని అన్నారు. భారత్ లో హింసాత్మక ఘటనలకు పాల్పడినవారికి అంతమొందించామని మోదీ అన్నారు.

 

Scroll to load tweet…

 

ఆపరేషన్ సిందూర్ ద్వారా సత్వర న్యాయం దక్కిందని.... ఇది భారత్ కొత్తతరహా విధానానికి నిదర్శనమన్నారు. భారత దళాలు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను చూసి యావత్ భారతీయులు గర్వపడుతున్నారని అన్నారు. మన త్రివిద దళాలు చక్రవ్యూహాన్ని పన్ని శత్రుదేశం పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసిందన్నారు. ఇకపై కూడా ఉగ్రవాదంపై భారత్ ఇలాగే కఠినంగా వ్యవహరిస్తుందని... వారికి మద్దతిచ్చేవారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు.

ఇకపై కూడా పాకిస్థాన్ కు వారి స్టైల్లోనే జవాబు ఇస్తామని... వారి అణుబెదిరింపులకు భయపడబోమని మోదీ అన్నారు. ఇకపై పాక్ తో ఎలాంటి సంబంధాలు ఉండబోవని... చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే అని ప్రధాని స్పష్టం చేసారు. భారత ప్రజల జోలికివస్తే అస్సలు ఊరుకునేదే లేదు... తగిన గుణపాఠం చెబుతామని నరేంద్ర మోదీ హెచ్చరించారు.