పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగానే ప్రతిస్పందించిందని… పాకిస్థాన్ లోనే కాదు ఉగ్రవాదులు ఎక్కడున్న వదిలిపెట్టబోమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

India Pakistan: ఉగ్రవాద నిరోధక చర్యలపై భారతదేశం యొక్క విధానాన్ని అంతర్జాతీయ వేదికపై వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసామని… ఇది ఇకపైనా కొనసాగుతుందని స్నష్టం చేసారు. ఒకవేళ ఇలాంటి ఉగ్రదాడి మళ్ళీ జరిగినా భారత్ స్పందన ఇలాగే ఉంటుందని… ఉగ్రవాదులు పాకిస్థాన్ కు కాదు ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టబోమని జైశంకర్ హెచ్చరించారు.  

ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడినుండే ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న ఉగ్రవాద స్థావరాలనే ఇటీవల భారత్ ధ్వంసం చేసిందని ఆయన స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రధాన ఉగ్రవాదులు, వారి నివాస స్థలం, వారు ఎక్కడ నుండి పనిచేస్తున్నారనే వివరాలను క్రమం తప్పకుండా విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

"తమ ఆపరేషన్ కొనసాగుతోంది ఎందుకంటే ఆ ఆపరేషన్ లో స్పష్టమైన సందేశం ఉంది. ఏప్రిల్ 22న మనం చూసిన ఘోర దాడులలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూస్తాం. అందుకే ఉగ్రవాదులు పాకిస్థాన్ లో ఉంటే అక్కడికి వెళ్లి కొడతాం... ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొడతాం. కాబట్టి ఈ ఆపరేషన్ కొనసాగించడంలో ఒక సందేశం ఉంది'' అని జైశంకర్ పేర్కొన్నారు. 

‘’అయితే ఆపరేషన్ కొనసాగించడం అంటే ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కాదు. ప్రస్తుతం, కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడంపై అంగీకారం కుదిరింది. కానీ తమ ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోబోం.. ఇప్పటిలాగే కఠిన చర్యలుంటాయి" అని జైశంకర్ హెచ్చరించారు. 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను వారి కుటుంబాల ముందే హత్య చేశారని విదేశాంగ మంత్రి గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన పర్యాటక రంగానికి హాని కలిగించడానికి, మత కలహాలను సృష్టించడానికి ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు. 

ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (LeT) సృష్టించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బాధ్యత వహించిందని జైశంకర్ అన్నారు. దాడి చేసిన వారిని భారత్ గుర్తించిందని, వారు LeTతో సంబంధం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత మనం ప్రతిస్పందించడం తప్పనిసరి, ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ప్రతిస్పందించకపోవడం అసాధ్యమన్నారు.
 
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయని జైశంకర్ తెలిపారు. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని స్పష్టం చేసారు జైశంకర్.