ఔరంగాబాద్ పేరు మార్పుపై కాంగ్రెస్లో ఎలాంటి వివాదం లేదు - బాలాసాహెబ్ థోరట్
ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేసే ముందు నిర్వహించిన కేబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేరు మార్పు కూడా ఉంది. అయితే ఈ ఔరంగాబాద్ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పేరు మార్చడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ రెండు జిల్లాల పేర్లను శంభాజీ నగర్, ధరాశివ్గా మారుస్తు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం చోటు చేసుకున్న ఒక రోజు తరువాత కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్ స్పందించారు. ఈ పేరు మార్పుపై తమ పార్టీలో ఎలాంటి వివాదం లేదని అన్నారు. తమ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని చెప్పారు.
ఎంవీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. అయితే AIMIM ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ.. తన పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతారని అన్నారు. ఔరంగాబాద్కు చరిత్ర ఉందని, దానిని ఎవరూ తుడిచివేయలేరని అన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పేరును ఎంవీఏ నేతలు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
మందు కోసం తాళి బొట్టు అమ్మకం.. అక్రమ మద్యం దుకాణంపై మహిళల దాడి.. ఎక్కడంటే?
‘‘ బంతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. మేము ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని ఛాన్స్ లను అన్వేషిస్తాం. మేము కూడా వీధుల్లోకి రావచ్చు” అని ఇంతియాజ్ జలీల్ బుధవారం సాయంత్రం మీడియాతో అన్నారు. ఛత్రపతి శంభాజీ పేరును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన, ఎంవీఏ ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయే తరుణంలో ఔరంగాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను ఆమోదించడాన్ని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ పేరును మార్చాలని శివసేన చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ సంకీర్ణంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ దీనిని అడ్డుకున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం పడిపోతున్న చివరి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత నెలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి వద్ద AIMIM నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ నివాళులర్పించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఈ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ఓవైసీని 10 నిమిషాల పాటు తమకు అప్పగించాలని లేదా ఔరంగజేబు ఉన్న చోటకే పంపాలని మహారాష్ట్ర పోలీసులను కోరారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఓవైసీకి వ్యతిరేకంగా ఎంవీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది.