Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ రేపు ప్రమాణం! షిండే వర్గానికి ఎన్ని మంత్రి పదవులంటే?.. జులై 11లోపు ప్రక్రియ పూర్తి!

మహారాష్ట్రలో వారంపాటు సాగిన పొలిటికల్ హైడ్రామా చివర దశకు చేరింది. శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వానికి కాలం చెల్లగా బీజేపీ సారథ్యంలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ ప్రభుత్వానికి చీఫ్‌గా, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణం తీసుకోబోతున్నట్టు సమాచారం. అనంతరం, మహారాష్ట్ర సీఎంగా ఆయన హైదరాబాద్‌కు రానున్నట్టు తెలిసింది.
 

bjps devendra fadnavis to took oath tomorrow.. 12 ministrial berths to shinde quota
Author
Mumbai, First Published Jun 30, 2022, 1:00 PM IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. సుమారు వారం పాటు సాగిన రిసార్టు రాజకీయం నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి బల పరీక్షకు జారీ చేసిన గవర్నర్ బీఎస్ కొశ్యారీ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు వెలువడిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఈ పరిణామంతో రెబల్స్‌కు, బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి వీడి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర సీఎంగా మళ్లీ దేవేంద్ర ఫడ్నవీస్ వెనక్కి రాబోతున్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు రేపు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. రేపు కేవలం మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం తీసుకోనున్నట్టు తెలిసింది. మిగతా మంత్రి పదవులకు తర్వాత ప్రమాణ స్వీకారాలు జరగనున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎంగా రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి.

రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తెలంగాణకు పర్యటించనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా హాజరుకాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

ఇదిలా ఉండగా, ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఈ ప్రభుత్వంలో ఏ హోదా దక్కనుందనే చర్చ కూడా మరో వైపు మొదలైంది. సుమారు 12 మినిస్ట్రియల్ బెర్త్‌లు షిండే వర్గానికి దక్కనున్నట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. కాగా, ప్రహర్ వంటి కొన్ని చిన్న పార్టీలకూ కొత్త ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించనున్నట్టు సమాచారం. స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి ముగ్గురికి మంత్రి సీట్లు దక్కనున్నాయి. ఈ మూడు సీట్లు అటు బీజేపీ, ఇటు షిండే కోటాలో భర్తీ చేయనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు ఇలా జరగొచ్చు..

షిండే వర్గం, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు లేఖ రాసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణాలు తీసుకుంటారు. అటు తర్వాత స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక కీలక నిర్ణయం జరిగే అవకాశం ఉన్నది. షిండే వర్గాన్ని శివసేన లెజిస్లేటివ్ పార్టీగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత విప్‌ల ఎన్నిక ఉంటుంది. అప్పుడు విశ్వాస పరీక్షకు గవర్నర్ అనుమతి ఇస్తారు. ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నది. మొత్తం జులై 11వ తేదీ కల్లా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios