Asianet News TeluguAsianet News Telugu

ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ.. ఎందుకంటే.. వీడియో వైరల్

రిలయన్స్ సంస్థల అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు (Mukesh Ambani breaks down in tears at Anant Ambani's pre-wedding event). కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral on social media)గా మారింది.

Mukesh Ambani breaks down in tears at Anant Ambani's pre-wedding event..ISR
Author
First Published Mar 2, 2024, 5:14 PM IST

భారత కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశంతో పాటు విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాల సెలబ్రెటీలు ఈ వేడుకకు వచ్చారు. అతిథుల కోసం సకల సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

అయితే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో అనంత్ అంబానీ మాట్లాడుతుండగా ముకేశ్ అంబానీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఈవెంట్ కు హాజరైన అతిథులను ఉద్దేశించి అనంత్ మాట్లాడుతూ.. జీవితంలో తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తన చిన్నతనంలో ఆరోగ్యంతో తాను పడిన కష్టాల గురించి మాట్లాడారు. దీంతో ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘‘నా కుటుంబం నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించింది. నా జీవితం పూర్తిగా గులాబీల మంచం కాదు. నేనూ ముళ్ల నొప్పిని అనుభవించాను. నేను చిన్నప్పటి నుండి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ మా నాన్న, తల్లి నేను బాధపడేందుకు ఎప్పుడూ అనుమతించలేదు. వారు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు’’ అని అనంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ముకేశ్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కమ్యూనిటీ విందుతో శుక్రవారం ప్రారంభమైంది. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వేలాది మందికి ఆతిథ్యం ఇచ్చారు. వారికి గుజరాతీ వంటకాలను వడ్డించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అత్యంత ధనవంతులతో సహా 1,000 మందికి పైగా అతిథులు హాజరవుతున్నారు. బిల్ గేట్స్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ వంటి టాప్ బాలీవుడ్ స్టార్స్ ఆహ్వానితులుగా ఉన్నారు.

శుక్రవారం నిర్వహించిన ఈవెంట్ లో పాప్ స్టార్ రిహానా ప్రదర్శన ఇచ్చారు. ఆమె ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. 'డైమండ్స్', 'రూడ్ బాయ్', 'పోర్ ఇట్ అప్' వంటి తన కాలాతీత విజయాలతో రిహానా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios