ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళకంటే ముందే ఈశాన్య రాష్ట్రాలవైపు కదులుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ పంథాలో కాకుండా కాస్త ముందుగానే పలకరిస్తున్నాయి. బంగాళాఖాతం ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడం వల్ల రుతుపవనాలు కేరళలో ప్రవేశించేలోపు ఈశాన్య రాష్ట్రాల వైపు ముందే కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కేరళలో రుతుపవనాలు..

ఇప్పటికే మే 20న మయన్మార్‌లోని అరకాన్ తీరాన్ని రుతుపవనాలు తాకినట్టు భారత వాతావరణ శాఖ గుర్తించింది. అక్కడి నుంచి ఇవి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోని అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోకి వేగంగా వస్తున్నాయని అంచనా. ఐఎండీ గతంలో మే 27న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పులు చూస్తే ఇది మే 26 లోపలే వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

వేసవి వేడి తగ్గే..

ఇక దక్షిణ భారతంలో వేసవి వేడి తగ్గే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. వడగాలులు ఇక తగ్గిపోతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వడగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించనుంది. వడగాలులు కొనసాగితే రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

ఇదే సమయంలో అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడుతోందని సమాచారం. దీని ప్రభావంతో మే 21న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

మొత్తానికి ఈసారి వర్షాలు ఎక్కడ మొదలవుతాయో, ఎలా కదులుతాయో అన్న దానిపై సాధారణ విధానం కంటే భిన్నంగా అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాలకు అనుగుణంగా రైతులు, ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.