Vande Matram: హలో కాదు గురు.. ఇప్పుడు కాల్ వస్తే వందేమాతరం అనాలి !
Maharashtra: మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి ఎక్ నాథ్ షిండే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు.. ప్రభుత్వ, ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఫోన్ కాల్లను స్వీకరించేటప్పుడు 'హలో'కి బదులుగా 'వందేమాతరం' అనే గ్రీటింగ్ని ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
No hello, only Vande Matram: ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసి 'హలో' అనడం సర్వసాధారణం. అయితే, ఇప్పటి నుంచి హలోకు బదులు 'వందేమాతరం' అనాలని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ సంస్థలకు మీరు కాల్ చేస్తే.. ఇక నుంచి అవతలి వ్యక్తి హలో కు బదులు వందేమాతరం అంటూ గ్రీటింగ్ తెలపనున్నారు.. !
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి ఎక్ నాథ్ షిండే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు.. ప్రభుత్వ, ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఫోన్ కాల్లను స్వీకరించేటప్పుడు 'హలో'కి బదులుగా 'వందేమాతరం' అనే గ్రీటింగ్ని ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. శనివారం నాడు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ రిజల్యూషన్ (GR) జారీ ప్రకారం.. ప్రభుత్వ, ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరూ పౌరుల నుండి టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ కాల్లను స్వీకరించేటప్పుడు 'హలో'కి బదులుగా 'వందేమాతరం' అనే గ్రీటింగ్ని ఉపయోగించడం తప్పనిసరి అంటూ పేర్కొంది. ప్రభుత్వ అధికారుల పలకరింపు విషయంలోనూ ఇది ఉపయోగించాలని సూచించింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన తీర్మానంలో అధికారులు తమను కలిసేందుకు వచ్చే ప్రజలకు వందేమాతరాన్ని గ్రీటింగ్గా ఉపయోగించేలా అవగాహన కల్పించాలని పేర్కొంది.
హలో అనేది పాశ్చాత్య సంస్కృతికి అనుకరణ. కేవలం 'ఏ విధమైన నిర్దిష్ట అర్ధం లేకుండా శుభాకాంక్షలు, ఏ విధమైన ప్రేమను రేకెత్తించదు' అని ప్రభుత్వ తీర్మానం పేర్కొంది. మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆగస్టులో ఆదేశాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను అప్పగించిన కొద్దిసేపటికే ఆయన తన మొదటి నిర్ణయాలలో ఒకటిగా ఈ ప్రకటన చేశారు. 'దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దాని ఔచిత్యానికి అనుగుణంగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై హలో ఉపయోగించకుండా వందేమాతరంతో టెలిఫోన్ సంభాషణను ప్రారంభించాలని నిర్ణయించారు' అని బీజేపీ నాయకుడు సుధీర్ ముంగంటివార్ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్మీ షిండే ప్రభుత్వ ఆదేశాలను విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి ఒత్తిడి గురయ్యారనీ, ప్రజలను ఎలా విభజించాలో మాత్రమే వారికి తెలుసు అంటూ విమర్శించారు. బాలాసాహెబ్ థాకరేను కలిసినప్పుడల్లా, ఆయన జై మహారాష్ట్ర అని పలకరించేవారని అన్నారు.