పరీక్షలో తప్పిన విద్యార్థులు తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్యలు చేసుకునే అనేక సంఘటనలు చూస్తుంటాం. కానీ ఈ పేరెంట్స్ లా ప్రతిఒక్కరు ఉంటే అసలు విద్యార్థులు ఆత్మహత్యలే ఉండవు. అంతగొప్ప పేరెంట్స్ ఎవరు? ఏం చేసారో ఇక్కడ తెలుసుకుందాం.
పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయంటే చాలు భయపడే పరిస్థితి ప్రస్తుతం ఉంది. మంచిమార్కులు వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఆనందంగా ఉంటే... మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బాధలో ఉంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఫెయిలై తల్లిదండ్రులకు భయపడి లేదంటే అవమానంగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా తరచూ పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య వార్తలు చూస్తుంటాం.
అయితే ప్రస్తుతం తల్లిదండ్రుల తీరులో మార్పు వస్తోంది. తమ పిల్లలు చదువులో రాణించకున్నా సరే వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే ఫ్రీడమ్ ఇస్తున్నారు. చివరకు తమ బిడ్డలు పరీక్షలో ఫెయిలైనా వారిని తిట్టి, కొట్టి ఒత్తిడికి గురయ్యేలా చేయడంలేదు. అందువల్లే ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాగా తగ్గాయి.
తాజాగా కర్ణాటకకు చెందిన ఓ దంపతులు మరో అడుగు ముందుకేసారు. అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిలైన కొడుకును పల్లెత్తిమాట అనలేదుకదా... స్నేహితులు హేళన చేస్తుంటే వారికే బుద్దిచెప్పారు. కొడుకు ఫెయిల్యూర్ ను జంట కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. చదువులో ఫెయిలయితేనేం... జీవితం ఇంకా చాలా ఉంది... అందులో తమ బిడ్డ సక్సెస్ అవుతాడన్న నమ్మకం ఆ తల్లిదండ్రులది. తనపై పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకం ఆ బాలుడిలో పట్టుదల పెంచింది... ఈసారి బాగా చదివి పాసవుతానని చెబుతున్నాడు. ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆరు సబ్జెక్టులు తప్పిన కొడుకుతో పేరెంట్ కేక్ కటింగ్ :
కర్ణాటకలో మే 2వ తేదీ అంటే గత శుక్రవారం పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితాల్లో బాగల్కోట్ పట్టణంలోని బసవేశ్వర ఇంగ్లీష్ మీడియంలో చదివే అభిషేక్ కూడా పదో తరగతి పరీక్ష రాసాడు. కానీ అతడు పరీక్షలో తప్పాడు. ఒకటి రెండు సబ్జెక్ట్స్ లో కాదు ఏకంగా ఆరు సబ్జెక్ట్స్ లో ఫెయిలయ్యాడు. 600 మార్కులకుగాను కేవలం 200 మార్కులు మాత్రమే సాధించాడు... అంటే 32 శాతం మార్కులు సాధించాడన్నమాట. దీంతో అతడిని స్నేహితులు ఎగతాళి చేసారు... చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా అభిషేక్ ను అవమానించే మాట్లాడారు.
అయితే తమ కొడుకు ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు సరికదా అతడికి మద్దతుగా నిలిచారు. ఫెయిల్ అయ్యానని కుండిపోకుండా తమ కొడుకుకు మనోధైర్యాన్ని నింపేలా వ్యవహరించారు. తమ కొడుకు ఓడిపోయింది పరీక్షలోనే జీవితంలో కాదు అనేది పదిమందికి తెలిసేలా చేయాలనుకున్నారు. దీంతో వెంటనే కేక్ తెప్పించి కొడుకుతో కట్ చేయించి కుటుంబమంతా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
తల్లిదండ్రులు కొడుకుకు కేక్ తినిపించి ముద్దాడారు. ఇప్పుడుకాకుంటే తర్వాతైన కొడుకు ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్నారు. దీంతో అభిషేక్ కూడా తల్లిదండ్రుల ప్రేమ, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చూసి పశ్చాత్తాపడ్డాడు. తాను ఈసారి బాగా చదివి పరీక్ష రాసి పాసవుతానని అంటున్నాడు. చదువులోనే కాదు జీవితంలోనూ పాసై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని చెబుతున్నాడు.
ఇలా కష్టసమయంలో తమ బిడ్డను సూటిపోటీ మాటలతో మరింత బాధపెట్టకుండా ఆ తల్లిదండ్రులు చేసినపని నెటిజన్లకు ఎంతగానో నచ్చింది. దీంతో అభిషేక్ కేక్ కటింగ్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి... ఆ తల్లిదండ్రులపై ప్రశంసలు కురుస్తున్నాయి. చదువుల పేరిట పిల్లలపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులే ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఇలాంటి పేరేంట్స్ ఉండటం అభిషేక్ అదృష్టమని... వారిని ఈతరం పేరెంట్స్ ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. అభిషేక్ కూడా ఈ తల్లిదండ్రులు గర్వపడేలా బాగా చదువుకోవాలని... లేదంటే మరేదైన రంగంలో రాణించాలని సూచిస్తున్నారు.