పిథోర్గడ్లో కొండచరియలు విరిగిపడటంతో కైలాస్ యాత్ర దారి మూసుకుపోయింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోర్గడ్ జిల్లా లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇక్కడ కైలాస్ యాత్ర ప్రధాన మార్గంలో భారీ కొండచరియలు అకస్మాత్తుగా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా వందలాది మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో భారీ శబ్దం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో కైలాస్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది.
కొన్ని అవాంతరాలు..
ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక బృందాలు, పోలీసు విభాగం ఘటనా స్థలికి చేరుకుని అప్రమత్తంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. పర్వత ప్రాంతం కావడంతో సహాయం అందించడంలో సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే, విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
యాత్రికులు ప్రస్తుతం మార్గం తెరచే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక అధికారులు ఆహారం, నీరు వంటి అవసరాలను అందజేస్తూ పరిస్థితిని చక్కబెడుతున్నారు. పర్వత మార్గాలలో ఇలాంటి అకస్మాత్తు ఘటనలు జరగడం సహజమైనదే అయినా, ఈ స్థాయిలో రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే చర్యలు తీసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు. పర్యటనల సమయంలో రహదారి పరిస్థితులపై ముందస్తుగా సమాచారం అందించే విధానాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.