భారత పర్యటనకు ట్రంప్ తో పాటుగా అతని కుమార్తె ఇవాంకా!
ట్రంప్ తో పాటు తన కూతురు ఇవాంకా కూడా వస్తున్న విషయం అధికారికంగా ధృవీకృతమైంది. ట్రంప్ తో పాటు అతనికి సలహాదారులుగా వ్యవహరిస్తున్న ఆయన కూతురు, అల్లుడు కూడా భారత పర్యటనకు వస్తున్నారన్న విషయం తేలిపోయింది.
ట్రంప్ భారత పర్యటన గురించి గత కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతుంది. ట్రంప్ ఎక్కడికి వస్తున్నాడు అనే చర్చ నుండి మొదలు... ట్రంప్ ఎవరెవరితో వస్తున్నదనేంత వరకు విపరీతంగా ఈ విషయమై అంతా మాట్లాడుకున్నారు. అందరూ మాత్రం ఒక ప్రశ్న అడిగారు.... ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ భారత పర్యటనలో భాగస్వామురాలవుతుందా అని?
ఆ సందేహానికి తెరదించుతూ.... ట్రంప్ తో పాటు తన కూతురు ఇవాంకా కూడా వస్తున్న విషయం అధికారికంగా ధృవీకృతమైంది. ట్రంప్ తో పాటు అతనికి సలహాదారులుగా వ్యవహరిస్తున్న ఆయన కూతురు, అల్లుడు కూడా భారత పర్యటనకు వస్తున్నారన్న విషయం తేలిపోయింది.
ఫిబ్రవరి 24 సోమవారం నాడు ట్రంప్ తన బృందంతో అహ్మదాబాద్ లో దిగుతారు. అక్కడ మొతేరా స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి ఆగ్రా బయల్దేరుతారు. అక్కడ తాజ్ మహల్ సందర్శన అనంతరం ఆయన ఢిల్లీ చేరుకుంటారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్ తొలిసారిగా భారతదేశ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24, 24 తేదీలలో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు అహ్మదాబాద్లోనూ ఆయన సతీ సమేతంగా పర్యటించనున్నారు.
అహ్మదాబాద్లో ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొటేరాలో ‘‘నమస్తే ట్రంప్’’ ఈవెంట్లో అగ్రరాజ్యాధినేత పాల్గొంటారు. దీనితో పాటు ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్ను సందర్శించనున్నారు.
Also Read:ట్రంప్ విమానంలో ఉండే సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే..
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతాధికారులు. వాహనాలు అహ్మదాబాద్కు ఇప్పటికే చేరుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం తర్వాత మొతేరాలో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ట్రంప్ నమస్తే ట్రంప్ పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభకు సుమారు 1,00,000 మంది వస్తారని అంచనా.
భారత్-యూఎస్ సంబంధాలను మెరుగుపరిచేందుకు గాను పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ మీడియాకు తెలిపారు. అమెరికా-భారత్ సంబంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ఇరు దేశాల వ్యాపార, రాజకీయ ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొని హైదరాబాద్ హౌస్లో భోజనం చేస్తారు. అదే సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ను కూడా ట్రంప్ దంపతులు సందర్శించే అవకాశం ఉంది. అనంతరం మోడీ, ట్రంప్ సంయుక్తంగా ప్రతికా ప్రకటనను విడుదల చేస్తారు.
Also Read:ట్రంప్ నా కలలోకి వచ్చాడంటూ... విగ్రహం కట్టిన తెలంగాణవాసి
భోజనం తర్వాత దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ట్రంప్ భేటీ అవుతారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చే విందులో పాల్గొని ఆయనతో సమావేశమవుతారు. మంగళవారం రాత్రి ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ తిరిగి వాషింగ్టన్ బయల్దేరి వెళతారు.
భారత పర్యటనలో ముఖ్యంగా ఇరు దేశాల వాణిజ్యంలో ఎదురువుతున్న అడ్డంకులపైనే ట్రంప్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. భారత్తో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య పరికరాల ఎగుమతులను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ట్రంప్ చూస్తున్నారు. అదే సమయంలో తమను ప్రాధాన్యత జాబితాలోకి తిరిగి చేర్చాలని భారతదేశం అగ్రరాజ్యాధినేతను కోరుకుంటోంది.