ఢిల్లీ అల్లర్లు: మురికి కాలువలో నిఘా విభాగం అధికారి మృతదేహం
ఈశాన్య ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ మృతదేహం కాలువలో కనిపించింది. ఇంటికి వెళ్తుండగా దాడి చేసి అంకిత్ శర్మను చంపేశారని అధికారులు అంటున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ మృతదేహం మురికి కాలువలో కనపించింది. ఆదివారం నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 20 మంది దాకా మృత్యువాత పడ్డారు.
అంకిత్ శర్మ మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మూక అతనిపై దాడి చేసిందని, చాంద్ బాగ్ బ్రిడ్జిపై దాడి చేసి అన్ని చంపేసిందని, ఆ తర్వాత శవాన్ని మురికి కాలువలో పడేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఢిల్లీ అల్లర్ల వెనక కుట్ర, అమిత్ షా రాజీనామా చేయాలి: సోనియా గాంధీ
మంగళవారం నుంచి అతని కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. అంకిత్ శర్మ తండ్రి రవిందర్ శర్మ కూడా ఇంటెలిజన్స్ విభాగంలోనే పనిచేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మద్దతుదారులు తన కుమారుడు అంకిత్ ను హత్య చేశారని ఆయన ఆరోపించారు.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఆదివారంనాడు ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి హింస చెలరేగుతూనే ఉంది. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లర్లలో ఓ పోలీసు కూడా మరణించిన విషయం తెలిసిందే.
Also Read: ఢిల్లీ అల్లర్లపై విచారణ: హైకోర్టులో బిజెపి నేత కపిల్ మిశ్రా వీడియో ప్లే