భారతదేశంలో జనాభా లెక్కలు 16 ఏళ్ల విరామం తర్వాత 2027 మార్చి 1 నాటికి పూర్తయ్యేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 4న (2025) ప్రకటించింది. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి డిజిటల్ జనగణన కావడం విశేషం.

కుల గణన తొలిసారిగా అధికారికంగా జరుగుతోంది. ఈ జ‌న‌గ‌ణ‌న రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఇళ్ల లెక్కింపు, గృహ సమాచారం సేకరణ, జనాభా లెక్కింపు. ఈ రెండూ ఫిబ్రవరి 28, 2027 నాటికి పూర్తవుతాయి. మొత్తం సమాచారానికి ఆధారంగా పరిగణించే తేదీ మార్చి 1, 2027 (ఉ. 12 గంటల సమయం) గా నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుందో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జూన్ 16న వెల్లడిస్తారు.

లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల లాంటి ప్రాంతాల్లో అక్టోబర్ 1, 2026ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. గతలో జనగణన 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన జనగణన, కరోనా వల్ల వాయిదా పడింది. ఈసారి 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పని చేయనున్నారు. వీరికి డిజిటల్ యాప్ ద్వారా డేటా సేకరణపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.

ఈసారి శిక్షణలో కుల గణనకి సంబంధించిన అంశాలు ముఖ్యమైన భాగంగా ఉండబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎస్సీ (SC), ఎస్టీ (ST) కేటగిరీలే లెక్కించారు. కానీ ఇప్పుడు ప్రతి కులానికి ఓ ప్రత్యేక బాక్స్ ఉండనుంది.

సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం

ప్ర‌జ‌లు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. కానీ ఇది కేవలం NPR (National Population Register) అప్‌డేట్ చేసిన కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ ప్రకటనలో NPR అప్‌డేషన్ పై ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. NPR ఆధారంగా NRC (పౌరుల జాబితా) సిద్ధం చేయాలన్న ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌భావం

ఈ జనగణన తరువాత నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 2001లో చేసిన 84వ సవరణ చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనగణన ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న సీట్లు 1971 జనగణన డేటా ఆధారంగా ఉన్నాయి. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ (లోక్‌సభ, అసెంబ్లీకి) కూడా జనగణన ఆధారంగా కొత్తగా వచ్చే నియోజకవర్గాలపై అమలవుతుంది.