India pakistan tensions: పాక్‌తో చర్చలు కేవలం పీఓకేతో పాటు ఉగ్రవాదుల తిరిగి అప్పగించే విష‌యంలోనే ఉంటాయ‌ని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేద‌ని తెలిపారు. 

India pakistan tensions: పాకిస్తాన్‌తో చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) తిరిగి తీసుకోవ‌డం, ఉగ్రవాదుల అప్పగింతలపైనే జరుగుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మోడీ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు ప్ర‌భుత్వ వర్గాలు వెల్లడించాయి.

"కాశ్మీర్ విషయంలో భారత్ స్పష్టంగా ఉంది. చర్చించాల్సిన ఏకైక అంశం పీఓకే తిరిగి అప్ప‌గించ‌డం గురించే. దాంతో పాటు ఉగ్రవాదుల అప్పగింతలపై వారు మాట్లాడితే, అది చర్చకు వస్తుంది. మిగిలిన విషయాలపై మాకు చర్చించే ఉద్దేశం లేదని" మోడీ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

అలాగే, మద్యస్థత అంశాన్ని కూడా మోడీ ఖండించారు. “ఈ అంశంలో మేము ఎటువంటి మద్యస్థతను కోరడం లేదు. మాకు మద్యస్థత అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో అమెరికా, చైనా దేశాల పేర్ల‌ను ప్రస్తావించ‌కుండానే సూటిగా భార‌త్ త‌న వైఖ‌రిని తెలిపింది. 

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 8 రాత్రి పాకిస్తాన్ నుండి జరిగిన దాడులకు భారత్ మే 9 రాత్రికి పాకిస్తాన్ అంతర్భాగంలోని 26 ప్రదేశాలను టార్గెట్ చేస్తూ బలమైన ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడులు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగాయి.

ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రకారం.. “ఇది కొత్త సాధారణ స్థితి. ప్రపంచం దీన్ని అంగీకరించాల్సిందే. పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరించాలి. ఇకపై ఇది సాధారణ వ్యవహారం కాదు” అని స్పష్టం చేశారు. 

మే 11 న మధ్యాహ్నం 1 గంటకు పాకిస్తాన్ డీజీఎంఓ చర్చలకు అభ్యర్థన పంపగా, భారత డీజీఎంఓ అప్పటికి సమావేశంలో ఉండటంతో 3:35 గంటలకు చర్చలు జరిగాయని ప్ర‌భుత్వ‌ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చలు కాల్పుల విరమణపై కాకుండా, కాల్పులు ఆపడం పట్ల పరస్పర అర్థంపూర్తులపై జరిగినట్లు తెలిసింది.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలు రాజకీయ, సైనిక, మానసిక వ్యూహాల పరంగా రూపొందించబడి ఉన్నాయి. ఈ చర్యల లక్ష్యం కేవలం ప్రతీకారం కాకుండా, వ్యవహార పద్ధతులనే పునర్ నిర్వచించడమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన జాతీయ భద్రతపై ఎలాంటి రాజీకి తావు లేదని, దాడులంటే తీవ్ర ప్రతిచర్య ఉంటుందని ప్రపంచ దేశాలకు స్పష్టమైన సంకేతం పంపినట్లు మోడీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.