కరోనా మహమ్మారి మరోసారి దూసుకొస్తోంది. రెండు వేవ్స్ రూపంలో వేలాది మంది ప్రాణాలను తీసుకున్న ఈ మాయదారి రోగం మళ్లీ పంజా విసురుతోంది.
సింగపూర్, హాంకాంగ్ వంటి ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో, భారత్లో మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉంది. మే 19 (సోమవారం) నాటికి దేశవ్యాప్తంగా కేవలం 257 యాక్టివ్ కోవిడ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా చాలా తేలికపాటి లక్షణాలతో ఉండటం వల్ల ఆసుపత్రి అవసరం పడలేదు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్త వేరియంట్లు: LF.7, NB.1.8
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కొత్త కోవిడ్ ఉపవేరియంట్లు LF.7, NB.1.8 — ఇవి JN.1 వేరియంట్ నుంచే ఉద్భవించాయి. ఇవే ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం, ఈ వేరియంట్లు తీవ్రమైన లక్షణాలు కలిగించడంలేదు. ప్రాణాపాయం లేదు. ఈ వ్యాప్తి కారణం కూడా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే కావొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఒక హై లెవల్ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో NCDC, ICMR, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ లాంటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ICMR ఆధ్వర్యంలోని జీనోమ్ సీక్వెన్సింగ్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెయిలెన్స్ ప్రోగ్రామ్ (IDSP)ల ద్వారా శ్వాస సంబంధిత వైరస్లు, కొత్త కోవిడ్ వేరియంట్లపై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ జరుగుతోంది. మ్యాక్స్ హెల్త్కేర్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా మాట్లాడుతూ, "ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్లు గతంలో భారత్లో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే అధికంగా ప్రమాదకరంగా లేవు" అన్నారు.
అశోక యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ, "LF.7, NB.1.8 వేరియంట్ల వల్ల వచ్చే కొన్ని నెలల్లో ఫ్లూ లక్షణాలు ఉన్న కేసులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇవి తీవ్రమైనవి కావు" అన్నారు. ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంటుందని, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు.