పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార చర్యలు తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత్ తాజాగా వాణిజ్య పరంగా కూడా పాక్ కు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్ని వస్తువుల దిగుమతిని భారతదేశం వెంటనే నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మే 2 నాటి నోటిఫికేషన్లో, "తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాకిస్థాన్ నుంచి అన్ని వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతులను నిషేధించడానికి" విదేశీ వాణిజ్య విధానం (FTP) 2023లో ఒక నిబంధన జోడించబడిందని పేర్కొంది.
ఈ నిషేధం జాతీయ భద్రత, ప్రజా విధానం ప్రయోజనాల దృష్ట్యా విధించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్లో తెలిపింది.
ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపు కావాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్కు ఉగ్రవాద సంబంధాలు బయటపడటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారతదేశం చర్య తీసుకుని, 1960లో రెండు దేశాలు సంతకం చేసిన కీలకమైన నీటి పంపిణీ ఒప్పందమైన సింధు నదీ ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గం వాఘా-అత్తారీ సరిహద్దు, పహల్గాం దాడి తర్వాత ఇప్పటికే మూసి వేసిన విషయం తెలిసిందే.
పాకిస్థానీ జాతీయుల అన్ని వీసాలను కూడా భారతదేశం రద్దు చేసింది. భారతదేశంలో నివసిస్తున్న వారికి భారత భూభాగాన్ని విడిచిపెట్టడానికి గడువు కూడా ఇచ్చారు. వైద్య వీసాలు కలిగిన వారు కూడా ఇందులో ఉన్నారు. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్ సిమ్లా ఒప్పందంతో సహా భారతదేశంతో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తామని బెదిరించింది. ఇక ఇరు దేశాలు వైమానిక మార్గాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.


