కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ పరిధిలో ఉన్న డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ ప్రభుత్వ యంత్రాంగం చర్యలతో ఆస్తి యజమానులకు తిరిగి అందింది. హైడ్రా చేప‌ట్టిన చ‌ర్య‌తో ల‌బ్ధ‌దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌నిక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

HYDRAA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) సోమవారం భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైద‌ర్‌న‌గ‌ర్‌లోని అక్రమ కబ్జాదారుల నిర్మాణాలను తొలగించి, 79 మంది ప్లాట్ యజమానులకు స్థలాన్ని అందజేసింది.

ఈ లేఅవుట్‌ సర్వే నంబర్ 145లో ఉంది, దీని విస్తీర్ణం సుమారు 9 ఎకరాలు 27 గుంటలు. ఈ స్థలంలో మధ్యతరగతికి చెందిన 79 మంది కొనుగోలుదారులు 2000 సంవత్సరంలో ప్లాట్‌లను సొంతం చేసుకున్నారు. అయితే కొంతకాలానికి శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ఈ స్థలాన్ని తనదిగా చెబుతూ అక్రమంగా ఆక్రమించుకున్నాడు. పైగా, ప్లాట్ యజమానులను లేఅవుట్‌లోకి రాకుండా నిరోధించేందుకు హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకున్నాడు.

బాధితులు న్యాయపరమైన పోరాటం కొనసాగించడంతో, 2024 సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు బాధితులకు మ‌ద్ధ‌తుగా వ‌చ్చింది. కోర్టు స్పష్టంగా ఈ స్థలం 79 మంది అసలైన యజమానులదే అని ప్రకటించింది. అయినప్పటికీ, కబ్జాదారులు అక్కడి నుంచి వెళ్ల‌కపోవడం, యాజమాన్య హక్కులను నిరాకరించడం కొనసాగించారు.

దీంతో ప్లాట్ యజమానులు HYDRAAకు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన HYDRAA అధికారులు, సోమవారం ఉదయం పోలీసుల మద్దతుతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. బుల్డోజర్లు రంగంలోకి దిగి తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా చర్యలు చేపట్టారు.

ఈ చర్యతో వాస్తవ యజమానులకు లేఅవుట్‌పై నియంత్రణ లభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని, దీన్ని సాకారం చేసిన HYDRAA అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కబ్జాలపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న దీటైన చర్యలకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అధికారులు చెబుతున్నారు.