Asaduddin Owaisi: వక్ఫ్ సవరించిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Asaduddin Owaisi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వక్ఫ్ ఆస్తుల నిర్వీర్యతకు దారితీసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయనిర్ణయం ద్వారా న్యాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో వేర్వేరు చట్టాలు ఉన్నాయి: ఒవైసీ
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఎలా యూనిఫాం అవుతుందని ప్రశ్నించారు. ఎందుకంటే దేశంలో వివిధ అంశాల కోసం వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి మద్దతు ఇచ్చే వారిని ఉద్దేశించి ఒవైసీ, "ఈ చట్టం లో వక్ఫ్ ఆస్తులు రక్షణ పొందే ఏ ఒక్క నిబంధన ఉందో చెప్పండి. ఆదాయం పెరగడానికి లేదా ఆక్రమణదారులను తొలగించడానికి ఏ నిబంధన ఉందో చూపించండి" అని సవాల్ విసిరారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఒవైసీ, ఈ కొత్త చట్టం వక్ఫ్ వ్యవస్థను క్షీణింపజేయడానికే రూపొందించిందని అభిప్రాయపడ్డారు. గత చట్టంలోని మంచి నిబంధనలను తొలగించారని అన్నారు. అలాగే, డావూదీ బోహ్రా సముదాయాన్ని వక్ఫ్ చట్టం పరిధిలోకి తీసుకురాకూడదని వారు కోరిన విషయాన్ని ఒవైసీ వెల్లడించారు.
వక్ఫ్ కొత్త చట్టంపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్
రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధంగా వుండడంతో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన ఒవైసీ, "ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావిస్తున్నాము. అందువల్ల న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాం" అని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు మే 20న వక్ఫ్ (సవరణ) చట్టానికి సంబంధించిన తాత్కాలిక ఉపశమనం అంశంపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి.ఆర్. గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ల బెంచ్ విచారించనుంది.
విచారణలో మూడు ప్రధాన అంశాలు చర్చకు వస్తాయి
1. కోర్టులు వక్ఫ్గా గుర్తించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారాలు,
2. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల మరియు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పు,
3. కలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తిస్తే ఆస్తిని వక్ఫ్గా పరిగణించకూడదన్న నిబంధన.
యూనిఫాం సివిల్ కోడ్ ఒవైసీ కామెంట్స్
యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై కూడా ఒవైసీ ప్రశ్నించారు. "మీరు గిరిజనులను, హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టాన్ని మినహాయిస్తే అదేలా యూనిఫాం కోడ్ అవుతుంది?" అని అన్నారు. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉన్నాయి. మితాక్షరా లేదా దయాభాగ స్కూళ్లలో ఏది అనుసరిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇండియాలోని వైవిధ్యాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనీ, ఒకరి అభిప్రాయాలను ఇతరులపై రుద్దరాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.