సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా?  

Covid 19 : సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియా కూడా అలర్ట్ అవుతోంది.. విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షత వహించారు. 

సింగపూర్, హాంకాంగ్‌లలో కేసులు చాలా సాధారణమైనవేనని.. మరణాలు సంభవించే స్థాయిలో లేవు. అయినా కేసుల పెరుగుదల దృష్ట్యా భారతదేశంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణుల సమీక్షా సమావేశం తేల్చింది. మే 19, 2025 నాటికి దేశంలో కేవలం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు మాత్రమే ఉన్నాయి… దేశ జనాభా దృష్ట్యా ఇది చాలా తక్కువ సంఖ్య. దాదాపు అన్ని కేసులు తేలికపాటివే, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే నయం అవుతున్నాయని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) మరియు ICMR ద్వారా కోవిడ్-19తో సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల నిఘా కోసం దేశంలో బలమైన వ్యవస్థ ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంది.