IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు కోవిడ్
IPL 2025 SRH: సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ పాజిటివ్గా తేలడంతో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్కు దూరమయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో పాల్గొనాలంటే వైద్య పరీక్షలపై ఆధారపడి ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Sunrisers Hyderabad IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఐపీఎల్ 2025లో మరొక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతను మే 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరగనున్న మ్యాచ్కు అందుబాటులో ఉండలేరు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ప్రధాన కోచ్ డానియేల్ వెటోరి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2025 మధ్యలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లీగ్ను ఒక వారం పాటు నిలిపివేయగా, ఆ సమయంలో చాలామంది విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. అందులో ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. అయితే, బీసీసీఐ టోర్నీ పునఃప్రారంభాన్ని ప్రకటించిన తర్వాత మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేసర్-మర్క్ లాంటి ఆటగాళ్లు మిగతా మ్యాచ్లకు దూరంగా ఉండగా, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడా, ట్రిస్టన్ స్టబ్లు తమ జట్లకు తిరిగి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్పటికే ప్యాట్ కమిన్స్ జట్టుతో కలిసిపోయారు. కానీ ట్రావిస్ హెడ్ భారత్కు రాకపోవడంతో అతడి లభ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. "ట్రావిస్ రేపు ఉదయం భారత్కు రానున్నాడు. కానీ అతడు ఇటీవల కోవిడ్ బారిన పడ్డాడు, అందుకే ప్రయాణం ఆలస్యమైంది. భారత్కు వచ్చిన తర్వాత అతని ఆరోగ్య స్థితిని పరిశీలించి, మిగతా మ్యాచ్ల్లో అతడి పాల్గొనగలగడాన్ని నిర్ణయిస్తాము" అని డానియేల్ వెటోరి తెలిపారు.
ఐపీఎల్ లో ట్రావిస్ హెడ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు ప్రధాన బలం. అయితే, ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 281 పరుగులు నమోదు చేసిన హెడ్, 28.01 సగటుతో, 156.11 స్ట్రైక్ రేట్తో రాణించాడు. ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 575 బంతుల్లో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన రెండో వేగవంతమైన ఆటగాడిగా ఘనత సాధించాడు.
ఇక ట్రావిస్ హెడ్ను జూన్ 11న లండన్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా జట్టులో ఎంపిక చేశారు. 2023లో భారతదేశాన్ని ఓడించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం డబ్ల్యూటీసీ టైటిల్ నిలబెట్టుకోవడం కోసం సిద్ధమవుతోంది.
ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది. మే 5న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఎస్ఆర్హెచ్ పోయింట్ల పట్టికలో 11 మ్యాచ్లలో 3 విజయాలు, 7 ఓటములు, ఒక ‘నో రిజల్ట్’తో 8వ స్థానంలో ఉంది. గత సీజన్లో ఫైనల్కు చేరిన హైదరాబాద్ టీమ్ ఈ సారి లీగ్ దశకే పరిమితమైంది.
లక్నోతో మ్యాచ్ అనంతరం హైదరాబాద్ టీమ్ మిగిలిన రెండు లీగ్ మ్యాచులు మే 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మే 25న కోల్ కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా అనేది వైద్య బృందపు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.