చనిపోయాడని భావించి మృతదేహాల గదికి.. కాపాడిన తండ్రి.. ఒడిశా ప్రమాదంలో వెలుగులోకి మరో ధీన గాథ
ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడిని అక్కడి సిబ్బంది చనిపోయాడని భావించారు. అతడిని డెడ్ బాడీలు భద్రపర్చిన గదికి తీసుకెళ్లారు. కానీ ఓ తండ్రి ఆరాటం అతడిని కాపాడింది. 230 కిలో మీటర్లు ప్రయాణించి కుమారుడిని రక్షించాడు.
ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయాలయ్యారు. ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. రైలు భద్రతా అంశాలు, బాధితుల ధీన గాథలు వంటివి రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వారి డెడ్ బాడీలను బహనాగా హైస్కూల్లోని గదిలో భద్రపర్చారు. ఆ గదిని తాత్కాలిక మార్చురీగా మార్చారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి చనిపోక ముందే మరణించాడని రెస్క్యూ సిబ్బంది భావించి ఆ గదిలోకి తరలించారు. అతడిపై శవాలను కుప్పగా వేశారు. అయితే అతడి తండ్రి కుమారుడిని వెతుక్కుంటూ వచ్చి, అతడు బతికే ఉన్నాడని గుర్తించి హాస్పిటల్ కు తరలించారు. ఈ హృదయ విదారక ఘటనను తాజాగా బాధితుడి తండ్రి హేలారామ్ మల్లిక్ ‘ఎన్డీటీవీ’తో పంచుకున్నారు. తన కుమారుడు పేరు విశ్వజిత్ అని, అతడు ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని అందరూ పొరబడ్డాడని ఆయన చెప్పారు. తన కుమారుడిపై మృతదేహాల కుప్ప ఉందని తెలిపారు.
గంగా జమునా స్కూల్ వివాదం : మేము ఇష్ట ప్రకారమే ముస్లిం మతంలోకి వచ్చాం.. స్పష్టతనిచ్చిన మహిళా టీచర్లు
ఒడిశా ప్రమాదం తెలిసిన వెంటనే తాను తన కుమారుడిని కనుగొనాలనే ఉద్దేశంతో 230 కిలో మీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టానని తెలిపారు. మార్చురీగా ఉన్న బహనాగా హైస్కూల్లో గదిలోకి ప్రవేశించి తన కుమారుడి జాడ కోసం వెతకడం ప్రారంభించానని అన్నారు. చివరికి ఓ ప్రాంతంలో విశ్వజిత్ ను గుర్తించానని, అయితే అతడిపై శవాల కుప్ప ఉందని తెలిపారు. తన కుమారుడు కూడా చనిపోయి ఉంటాడనుకొని, పొరపడి ఇలా చేశారని చెప్పారు. వెంటనే కుమారుడిని బయటకు తీసి బాలాసోర్ హాస్పిటల్ కు తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కోల్ కతాలోని ఎస్ఎస్ కే ఎం హాస్పిటల్ కు తీసుకొచ్చానని అన్నారు. కాగా.. ఈ ప్రమాదంలో అతడి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఒడిశాలో రైలు ప్రమాదం : రూ.2000 నోట్ల విషయంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే ?
ఈ ప్రమాదాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ.. కొంత ఆలస్యం అయితే తన కుమారుడిని శాశ్వతంగా కోల్పోయేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు చాలా బాధాకలిగించిందని అన్నారు. ‘‘నా కుమారుడు 2 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. 15 రోజులు మాతో గడిపాడు. తిరిగి వెళ్లిపోబోతుంటే ఈ ఘటన జరిగింది. ఇది మాకు చాలా బాధ కలిగించింది. మళ్ళీ వెళ్ళాలా ? వద్దా ? అనేది అతడి ఇష్టం. ఒక తండ్రిగా నేను వెళ్ళవద్దని మాత్రమే అతడికి సలహా ఇస్తాను. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కానీ అతడి కాళ్ళు, చేతుల విషయంలోనే ఆందోళన చెందుతున్నాము. నాకు డబ్బు ముఖ్యం కాదు. నా కొడుకు ముఖ్యం. నేను నా కుమారుడిని కనుగొన్నాను ఇది చాలు. సీఎం మమతా బెనర్జీ అందించే పరిహారం మాకు ఎంతో ఉపయోగపడుతుంది? ఆమెకు రుణపడి ఉంటాం’’ అని ఆయన తెలిపారు.