జ్ఞానవాపి సముదాయాన్ని ‘మసీదు’ అనలేం.. ముస్లిం సమాజం చారిత్రాత్మక తప్పును అంగీకరించాలి - యూపీ సీఎం యోగి
జ్ఞానవాపి విషయంలో ముస్లిం సమాజం తన చారిత్రాత్మక తప్పును అంగీకరించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అనలేమని, అలా పిలిస్తే అది వివాదాస్పదం అవుతుందని చెప్పారు.

జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అనలేమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజలు దానిని పరిశీలించాలని అనుకుంటున్నారని, తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. సోమవారం ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముస్లిం పక్షం తన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించాలని, పరిష్కారాన్ని ప్రతిపాదించాలని అన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ను జ్ఞానవాపి, కాశీ విశ్వనాథ ఆలయ సమస్య పరిష్కారం గురించి అడిగినప్పుడు ఆయన స్పందిస్తూ.. ‘‘మేము జ్ఞానవాపిని మసీదు అని పిలవలేం. అలా పిలిస్తే వివాదం అవుతుంది. ప్రజలు పరిశీలించాలని నేను అనుకుంటున్నాను. మసీదు లోపల 'త్రిశూలం' ఏం చేస్తోంది. మేము దానిని అక్కడ ఉంచలేదు. జ్యోతిర్లింగం ఉంది. దేవుడి విగ్రహాలు ఉన్నాయి, గోడలు అరుస్తున్నాయి.’’ అని అన్నారు.
ఈ వివాదానికి పరిష్కారం ముస్లిం సమాజం నుంచే రావాలని అనుకుంటున్నానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వారే తమ తప్పును అంగీకరించాలని భావిస్తున్నానని అన్నారు. ‘‘ముస్లిం పక్షం తన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించాలి. వారే ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించాలని నేను భావిస్తున్నాను.’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు ఆవరణలో ఏఎస్ఐ సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 3 వరకు స్టే విధించింది. అదే రోజున వారణాసి జిల్లా జడ్జి జూలై 21న జ్ఞాన్వాపి మసీదు ఏఎస్ఐ సర్వే ఆర్డర్పై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సవాలుపై హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి ప్రితింకర్ దివాకర్ ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదు ప్రాంగణాన్ని (వుజుఖానా మినహా) సర్వే చేయాలని ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ నిన్న అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మసీదు ఆవరణలో ఏడాది పొడవునా పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కోర్టులో దాఖలు చేసిన దావాలో భాగస్వామ్యులైన నలుగురు హిందూ మహిళా ఆరాధకులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఉత్తర్వును జారీ చేసింది న్యాయస్థానం.
అయితే మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించేందుకు కొంత వెసులుబాటు కల్పించేందుకు జూలై 24న సుప్రీంకోర్టు.. జూలై 26 సాయంత్రం 5 గంటల వరకు ఏఎస్ఐ సర్వేపై స్టే విధించింది. ఈ స్టేను అలహాబాద్ హైకోర్టు గత గురువారం (జూలై 27) వరకు పొడిగించింది. హిందూ మహిళా ఆరాధకులు పేర్కొన్న విధంగా శాస్త్రీయ సర్వే పూర్తయితే, మసీదు ఆవరణ మొత్తం ధ్వంసం అవుతుందని అంజుమన్ కమిటీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే మసీదు కమిటీ దాఖలు చేసిన ఈ ప్రధాన పిటిషన్లో వారణాసి జిల్లా కోర్టులో హిందూ పార్టీ తరపున దాఖలైన వ్యాజ్యం నిబంధనల మేరకు తగిన ప్రమాణ పత్రాల్లో లేనందున దానిని కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు.