సుప్రీంకోర్టు చరిత్రలో అపూర్వ ఘట్టం.. మూడోసారి మహిళా బెంచ్ ఏర్పాటు..
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో నేడు చాలా కీలక ఘట్టం జరిగింది. మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయబడింది. మ్యాట్రిమోనియల్, బెయిల్ పిటిషన్లను విచారించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురువారం జస్టిస్ హిమా కోహ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయబడింది. వివాహ వివాదాలు, బెయిల్ పిటిషన్లను విచారించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురువారం జస్టిస్ హిమా కోహ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని 11వ నంబర్ కోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాలను విచారిస్తోంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ పిటిషన్లతో సహా 32 పిటిషన్లు ఈ బెంచ్ కు జాబితా చేయబడ్డాయి.
2013లో తొలి మహిళా బెంచ్
2013లో న్యాయమూర్తులు జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్లతో తొలిసారి మహిళ న్యాయమూర్తులతో కూడిన ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 2018లో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ ఏర్పాటైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, వీరిలో జస్టిస్లు కోహ్లీ, బివి నాగరత్న , త్రివేది ఉన్నారు. జస్టిస్ నాగరత్న 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆమె సీజేఐ బాధ్యతలు చేపడితే.. సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అయిన ఘనత సాధిస్తారు.
కాగా.. 2020లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరేశ్వర్ ప్రతాప్.. తొలిసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో పూర్తిస్థాయి బెంచ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో సహా 27 మంది న్యాయమూర్తులు ఉండగా, మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34గా ఉంది. ఇదిలా ఉండగా కొలీజియం సిఫారసుల మేరకు న్యాయమూర్తుల నియామకం చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. నియామకాల ఫైళ్లను నిలుపుదల చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.