ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయా? మాజీ భార్యతో రేప్ కేసులో కాంప్రమైజ్... భర్తకు ఢిల్లీ హైకోర్టు వెరైటీ పనిష్మెంట్...
మాజీ భర్తపై రేప్ కేసు పెట్టిన మహిళ రెండేళ్ల తరువాత కాంప్రమైజ్ కు వచ్చింది. దీంతో సదరు నిందితుడికి ఢిల్లీ హైకోర్టు విచిత్రమైన శిక్షను విధించింది.
ఢిల్లీ : అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టు కెక్కింది ఓ మహిళ. అయితే, చివరికి ఇద్దరూ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పరిష్కారం కాని కేసులతో కోర్టులు సతమతమవుతుంటే.. ఇలాంటి కేసులతో తమ విలువైన సమయాన్ని వృధా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే అతనికి విచిత్రమైన శిక్షను విధించింది. నోయిడా, మయూర్ విహార్ లో బర్గర్ కింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడు అతను.
అయితే, వైవాహిక బంధంలో ఉండగా భర్త తనను శారీరకంగా, మానసికంగా హింసించడంతో 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్ల పాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా జూలై నాలుగవ తేదీన న్యూ ఢిల్లీ సాకేత్ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే, ఈ ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేశారు. ఈ సమయంలో ఎన్నో కీలక అంశాలను చర్చించేవాళ్ళం. కాబట్టి, పిటిషనర్ ఖచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఆర్ఎస్ఎస్ చీఫ్గా మహిళను నియమిస్తారా?: మోహన్ భగవత్ ను నిలదీసిన దిగ్విజయ్సింగ్
ఈ మేరకు అతని మీద దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాధలకు బర్గర్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాధాశ్రమాలను ఎంచుకుని వందమంది దాకా అనాధలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని కోర్టు ఆదేశించింది. శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. అంతేకాదు, మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాధలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.