అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చైనా.. పాకిస్థాన్‌పై త‌న‌కున్న విధేయ‌త‌ను చాటుతూనే ఉంది. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చైనా త‌న మ‌ద్ధ‌తును బహిరంగంగానే చాటుతోంది. 

ఇండియా - పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతల తర్వాత చైనా పాకిస్తాన్‌కు త‌న పూర్తి స‌హ‌కారాన్ని అందించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే జే-35ఏ (J-35A) స్టెల్త్ యుద్ధ విమానాల డెలివరీని వేగంగా పూర్తిచేస్తోంది. పాకిస్థాన్‌కు ఇది ఒక రివార్డులా ఇస్తున్న‌ట్లు బీజింగ్, ఇస్లామాబాద్‌లో ఉన్న టాప్ డిప్లొమాటిక్ వర్గాలు పేర్కొన్నాయి.

చైనా తయారుచేసిన ఈ ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానాలు 2025 ఆగస్ట్‌లో పాకిస్తాన్‌కు చేరనున్నాయి. మొదటి విడతలోనే 30 జే-35ఏ విమానాలు ఇస్తున్నారు. ఇది రెండు దేశాల మల్టీ లెవెల్ డిఫెన్స్ భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

50 శాతం తగ్గింపు, సులభమైన చెల్లింపు విధానం:

అయితే ఈ కొనుగోలు విష‌యంలో కూడా పాకిస్థాన్‌కు పూర్తి స్థాయిలో మ‌ద్ధ‌తు అందిస్తోంది. ఈ విమానాలపై చైనా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా, తక్కువ వడ్డీతో లేదా సులభమైన చెల్లింపు అవకాశాలను కూడా కల్పిస్తోంది. పాకిస్తాన్ వైమానిక దళం భార‌త్‌పై దిగిన ప్ర‌తీకార దాడికి ఈ డీల్ రివార్డుగా భావిస్తున్నారు.

2024 చివర్లోనే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 40 J-35A స్టెల్త్ ఫైటర్‌లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. చైనా తయారుచేసిన ఈ తరహా యుద్ధవిమానాలను తొలిసారి ఎగుమ‌తి చేస్తోంది.

చైనాలో శిక్ష‌ణ‌:

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) కు చెందిన పైలట్లు ఇప్ప‌టికే బీజింగ్‌లోని చైనా వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ద్వారా పీఏఎఫ్ త్వరలో ఐదో తరం ఎయిర్ పవర్ సామర్థ్యాన్ని సంపాదించనుంది.

ఇదిలా ఉంటే ఈ విమానాల ఒప్పందంతో పాటు, చైనా రూ. 25 బిలియన్ డాలర్లను పాకిస్తాన్‌లోని మిలిటరీ, సివిల్ మౌలికసదుపాయాల్లో పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి CPEC (చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్) ఫేస్-2లో భాగంగా జ‌ర‌గ‌నుంది.

అంతే కాకుండా ఈ భాగస్వామ్యంలో భాగంగా గ్వాదర్ పోర్ట్ నిర్వహణకు పాకిస్తాన్ భద్రతను మరింత బలోపేతం చేస్తోంది. ఇది చైనా పెట్టుబడులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తీసుకున్న కీలక నిర్ణయంగా తెలుస్తోంది.

చైనా - పాకిస్తాన్ మధ్య బలపడుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు, భారత ఉపఖండంలో భ‌ద్ర‌త‌కు సంబంధించి తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.