ఆది శంకరాచార్యుని జన్మస్థలమైన కేరళలోని కాలడి నుంచి కశ్మీర్లోని శారదా పీఠం వరకు ప్రత్యేక బుల్లెట్ ర్యాలీ జరగబోతోంది. ‘బుల్లెట్ ఎగెయినెస్ట్ బుల్లెట్’ అనే నినాదంతో, ఈ ఐతిహాసిక ప్రయాణం జూన్ 1న ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 100 మందికిపైగా దేశభక్తి భావాలతో నిండిన రైడర్లు తమ తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై 3,600 కిలోమీటర్ల దూరం పయనించనున్నారు. ఈ ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆర్. రామానంద్, భారత ఆధ్యాత్మికతను గౌరవించే వ్యక్తిగా మాత్రమే కాకుండా, రచయితగా, ఆధ్యాత్మిక పరిశోధన సంస్థ అయిన 'అభినవ గుప్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ స్టడీస్' డైరెక్టర్గా ప్రముఖులు. ఆయన పహల్గామ్లో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు.
ఈ యాత్రకు ప్రత్యేకత ఏమిటంటే:
దేశాన్ని భయపెట్టే తుపాకుల బదులు ప్రజాస్వామ్య బుల్లెట్లు.. అంటే బైక్లు ద్వారా దేశభక్తితో పాటు నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పహల్గామ్ దాడిలో చనిపోయినవారికి నివాళిగా, దేశాన్ని అశాంతిగా మార్చే శక్తులకు సమాధానం చెప్పేందుకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
మహిళలు, యువత, రైతులు, ఐటీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు ఈ ర్యాలీలో భాగమవుతున్నారు. చలో ఎల్ఓసి (ChaloLOC) అనే వాట్సాప్ గ్రూప్గా మొదలై ఒక పెద్ద గుంపుగా మారింది. మణికార్తిక్ (ప్రెసిడెంట్), సుకన్య కృష్ణ (సెక్రటరీ), సుమేష్ (ట్రెజరర్) ఉన్నారు.
కేరళ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, గవర్నర్ ఆర్లేకర్ ఈ యాత్రకు తమ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఫండ్లు సేకరించలేదు. ఒక్కో వ్యక్తి తన ఖర్చుతోనే ఈ బైక్ యాత్రలో పాల్గొంటున్నాడు. ఈ యాత్రలో పాల్గొనే ఒక్కొక్కరికీ సుమారు రూ. 60 వేలు ఖర్చవుతుందని అంచనా. ఈ యాత్ర జూన్ 1న ప్రారంభమై, జూన్ 12న కశ్మీర్లో ముగియనుంది.